అమలా పాల్  చిత్రం ప్రారంభం

Published On: August 13, 2019   |   Posted By:
అమలా పాల్  చిత్రం ప్రారంభం
 
నాయికగా ఫోరెన్సిక్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం

అమలా పాల్ నాయికగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతున్న  చిత్రం షూటింగ్ శనివారం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలైంది. అరుణ్ ఆదిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ పనికర్ దర్శకుడు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. ఫణీన్ద్ర కుమార్, ప్రభు వెంకటాచలం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు.
 
ముహూర్తపు సన్నివేశానికి ‘రాక్షసుడు’ డైరెక్టర్ రమేష్ వర్మ కెమెరా స్విచాన్ చేయగా,  తెలంగాణా ఫిలిం చాంబర్ అధ్యక్షుడు పి. రామ్మోహన్ రావు క్లాప్ కొట్టారు.  దర్శకుడికి స్క్రిప్తును భరద్వాజ్ అందజేశారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ “ఫోరెన్సిక్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్లో ఈ సినిమా తయారవుతోంది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏమిటో ఈ సినిమాలో చూపించనున్నారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తోన్న అమలా పాల్ మరోసారి ఆ తరహా పాత్రను చేస్తోంది. మూడు నెలల్లో సినిమాని పూర్తిచేసి, విడుదల చెయ్యాలనేది నిర్మాతల సంకల్పం” అని చెప్పారు.
 
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ “ఈ మధ్య చేసిన ఒక సినిమా తర్వాత నన్ను ఇమ్రాన్ హష్మి అవుదామనుకుంటున్నారా?.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. ఈ సినిమాలో ఒక భిన్నమైన, నటనకు మంచి అవకాశమున్న రోల్ చేస్తున్నాను. ఇది ఇంటెన్స్ ఫిలిం” అని తెలిపారు.
 
అమలా పాల్ మాట్లాడుతూ “ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాను. తమిళ సినిమాని అజయ్ పనికర్ తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో ‘కడావర్’ అనే టైటిల్ పెట్టాం. ఇదొక ఫోరెన్సిక్ థ్రిల్లర్. నేను ఫోరెన్సిక్ డాక్టర్ కేరెక్టర్ చేస్తున్నా. చెన్నైలో జరిగిన కొన్న యథార్థ ఘటనలను ఆధారం చేసుకొని రైటర్ అభిలాష్ ఈ కథ రాశారు. బ్రిలియంట్ యాక్టర్ అయిన అరుణ్ ఆదిత్ ఒక రియలిస్టిక్ కేరెక్టర్ చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది” అన్నారు.
దర్శకుడు అనూప్ పనికర్ మాట్లాడుతూ “చెన్నైలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ స్క్రిప్ట్ తయారైంది. ఫోరెన్సిక్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది” అని చెప్పారు.
 
నటుడు వినోద్ సాగర్ మాట్లాడుతూ “తెలుగులో ‘రాక్షసుడు’తో ఎంట్రీ దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇది తెలుగులో నా రెండో సినిమా. డబుల్ ధమాకా సాధించినట్లుగా ఉంది” అన్నారు. టెర్రిఫిక్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోందని సినిమాటోగ్రాఫర్ అరవింద్ సింగ్ తెలిపారు.
 
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో  నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో అమలా పాల్, అరుణ్ ఆదిత్, రిత్విక, హరీష్ ఉత్తమన్, రవిప్రకాష్, వినోద్ సాగర్, అతుల్య రవి తారాగణం.
అభిలాష్ కథ సమకూర్చిన ఈ చిత్రానికి మ్యూజిక్: రోనీ, సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్, యాక్షన్: విక్కీ, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాతలు: జె. ఫణీన్ద్ర కుమార్, ప్రభు వెంకటాచలం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనూప్ పనికర్.