అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన

Published On: January 6, 2020   |   Posted By:
అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన
 
గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం అంత గొప్పది  “అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన”  కార్యక్రమం : ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ 
  
తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తముగా చాటి చెప్పేలా   “జనవరి 6న లక్షలాది మంది విద్యార్థులతో ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” అనే వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు జయశేఖర్. ఈ సందర్భం గా  ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” పోస్టర్ ని ఈ రోజు ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. 
 
ఈ  కార్యక్రమం లో కె .విశ్వ నాథ్ మాట్లాడుతూ…“  శత శతక కవి చిగురుమళ్ల శ్రీనివాస్ గారు కొన్ని పద్యాలూ పాడి వినిపించారు. ఎంతో అర్ధవంతం గా, వేమన పద్యాలూ గుర్తు చేసేలా  ఉన్నాయి.  వారికి తెలుగు మీద ఎంత అవగాహన, అమ్మ నాన్న , గురువు ల పై ఎంత భక్తి ఉందో పద్యాలు విన్నాక తెలుస్తుంది. ఇవి భావి తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్య క్రమముతో   పిల్లలను తీర్చిదిద్దాలని కంకణము కట్టుకున్నారు వీరు. లక్ష మంది పిల్లలు పాడుతున్నారంటే నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పొచ్చు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, అలా భాషాభిమానముతో  ఇలాంటి  గొప్ప కార్యక్రమాన్ని హితోధికముగా  చేస్తోన్న తాళ్లూరు జయశేఖర్, చిగురుమళ్ళ శ్రీనివాస్ ని అభినందిస్తున్నాను“అన్నారు. 
    
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్  నిర్వహణలో “అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన”  జనవరి 6న జరుగుతుందని,  ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు జయశేఖర్ గారు తెలియజేశారు. 
 
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ …“భద్రాద్రి కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్  రచించిన అమ్మ శతకం, నాన్నశతకం, గురువు శతకాల లోని పద్యాలను విద్యార్థులచే కంఠస్థం చేయించి ఎవరి పాఠశాలలో వారు సమావేశమై సామూహిక గానం చేసే బృహత్ యజ్ఞం ఇది“అన్నారు. 
   
   అమ్మానాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం  కలిగించడం, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించటం, విలువలను భావితరాలకు అందించటం, వంటి సదుద్దేశాలతో  తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.   రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాలలో  ఈ  పద్యార్చన  జరగబోతుందని,  ఈ కార్యక్రమంలో లక్షలాదిగా విద్యార్థులు పాల్గొనాలని ఆయన  తెలియజేశారు.
 
“అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” కు ప్రముఖ సాహితీ వేత్తలు  చంద్రబోస్, నటుడు తనికెళ్ళ భరణి సపోర్ట్ చేస్తున్నారు.