ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌

Published On: February 7, 2020   |   Posted By:

ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చేతుల  మీదుగా ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌
శ్రీ సాయి అమృత లక్ష్మి క్రియేషన్స్‌, పాలిక్‌ స్టూడియోస్‌, భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌  పతాకాలపై పాలిక్‌ దర్శకత్వంలో గోదారి భానుచందర్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’.

శ్రీజిత్‌ లవన్‌, జీవా, సుమన్‌ శెట్టి, దివ్య, రాతేష్‌, అభిగ్యాన్‌, లక్కి, ఎస్‌.వింధ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘురామ్‌ సంగీతాన్ని  సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చేతుల  మీదుగా లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ…‘‘తెలంగాణ పోరడు’ అనే పాట వినసొంపుగా ఉంది. నూతన తారాగణంతో దర్శకుడు పాలిక్  చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాలి. యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు. 

దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ…‘‘పట్టణాలు, పల్లెలో, గ్రామాల్లో ఇటీవల  మేము విడుదల  చేసిన ‘తెలంగాణ పోరడు’ సాంగ్‌ మారుమోగుతోంది. గోదారమ్మ పరవళ్లు తొక్కినట్టుగా రఘురామ్‌ గారు అందమైన బాణీ సమకూర్చగా దానికి సురేష్‌ గంగుల  తెలంగాణ మట్టి పరిమళింపులాంటి చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. ఇంత మంచి పాటని గురువుగారు కళాతపస్వి, గొప్ప దర్శకుడైన కె.విశ్వనాథ్‌ గారి చేతుల  మీదుగా లాంచ్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వతహాగా నేను కొరియోగ్రాఫర్‌ని కావడంతో కె.విశ్వనాథ్‌గారి చిత్రాల్లోని పాటల నృత్వాలను ఎంతో మంది పిల్లలకు నేర్పించేవాణ్ని. ఇక నా మొదటి సినిమాలోని మొదటి పాటను వారు  ఆవిష్కరించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా’’అన్నారు. 

నిర్మాత గోదారి భానుచందర్‌ మాట్లాడుతూ…‘‘నా మిత్రుడు పాలిక్‌ రఘురామ్‌ గారి దగ్గర నుంచి మంచి బాణీని తీసుకొని దానికి సురేష్‌ గంగులతో అర్థవంతమైన సాహిత్యాన్ని రాయించారు. అలాంటి పాటను కె.విశ్వనాథ్‌ గారితో లాంచ్‌ చేయడం శుభ సూచకంగా భావిస్తున్నాం. త్వరలో ఫైనల్‌ షెడ్యూల్‌ని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించనున్నాం. ఎన్నో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి దర్శకుడు చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు’’ అన్నారు. 

కో`ప్రొడ్యూసర్‌ రామ్‌ గడికొప్పుల  మాట్లాడుతూ…‘‘తెలంగాణ పోరడు’ అనే పాటకు ఎంత మంచి బాణీ కుదిరిందో అదే విధంగా ప్యూర్‌ తెలంగాణ పదాలతో అంత మంచి సాహిత్యం కుదిరింది. ఇవన్నీ ఒకెత్తైతే మా సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ని కె.విశ్వనాథ్‌ గారు లాంచ్‌ చేయడం మా అదృష్టం. ఇలా ప్రతిది మా సినిమాకు కుదురుతోంది. మా ఫస్ట్‌ సింగిల్‌ సక్సెస్ సాధించి సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలను పెంచింది. ఆ అంచనాలను అందుకునేలా మా దర్శకుడు సినిమాను కూడా తీర్చిదిద్దుతున్నారు’’ అన్నారు. 

సంగీత దర్శకుడు రఘురామ్‌ మాట్లాడుతూ…‘‘కళాతపస్వి చేతుల  మీదుగా నేను కంపోజ్‌ చేసిన సాంగ్‌ లాంచ్‌ చేయడం చాలా సంతోషం. సురేష్‌ గంగుల  చక్కటి సాహిత్యాన్ని సమకూర్చగా అదితి భావరాజు తన గళం తో పాటకు  ప్రాణం పోశారు. సోషల్‌ నెట్‌ వర్క్స్‌లో మంచి కామెంట్స్‌తో, వ్యూస్‌తో పాట దూసుకెళ్తోంది’’ అన్నారు. 

శ్రీజిత్‌ లవన్‌ మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్‌ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ని కె.విశ్వనాథ్‌గారు లాంచ్‌ చేయడం అదృష్టం. సంగీతం, సాహిత్యం పోటీ పడేలా సాంగ్‌ ఉందంటున్నారు. మేము సినిమా చేస్తున్నాం అన్నాక ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు.  మా పాట రిలీజై వారందరికీ మంచి సమాధానం చెప్పింది. మిగతా పాటలు  కూడా ఇదే స్థాయిలో ఉండబోతున్నాయి. సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా దర్శక, నిర్మాతలు  ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేస్తున్నారు’’ అన్నారు.  

ఇటీవల  `పేపర్ బాయ్` చిత్రం లోని  `బొంబాయి పోతావా రాజా పాటతో పేరు తెచ్చుకున్న సింగర్ రఘురామ్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయగా, ఇదే పాట తో లిరిసిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేష్ గంగుల లిరిక్స్ రాయగా ,  `వెంకీ మామ` చిత్రం లోని `కోకో కోలా పెప్సీ` పాట తో ఫేమస్ అయినా సింగర్ అదితి భావరాజు  `తెలంగాణ పోరడు పాట పాడటం విశేషం.  

ఈ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఇంకా నటులు  పంకజ్‌, చంద్రసిద్దార్ధ్‌, ఎస్‌.వింధ్యారెడ్డి పాల్గొన్నారు.    శ్రీజిత్‌ లవన్‌, జీవా, సుమన్‌ శెట్టి, చంద్రసిద్ధార్థ, పంకజ్‌, దివ్య, రాతేష్‌, అభిగ్యాన్‌, లక్కి, ఎస్‌.వింధ్యారెడ్డి తదితరులు  నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్‌, పాటలు : సురేష్‌ గంగుల , ఎడిటర్‌: రేణు, ఆర్ట్‌:సత్య నాగేష్‌, కో`ప్రొడ్యూసర్‌:రామ్‌ గడికొప్పుల,  సినిమాటోగ్రాఫర్‌:మల్లిఖార్జున్‌, నిర్మాత: గోదారి భానుచందర్‌, రచన`దర్శకత్వం: పాలిక్‌.