కాశీ విశ్వనాథ్ గారిని కలసిన  మెగాస్టార్

Published On: November 15, 2020   |   Posted By:
కాశీ విశ్వనాథ్ గారిని కలసిన  మెగాస్టార్
 
గురువుని కలసిన  మెగాస్టార్ 
 
తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. 
విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్ లో మైలురాయి గా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. 
 
తనని క్లాస్ అండ్ క్లాసికల్ హీరోగా నిలబెట్టిన దర్శకనాధుడు శ్రీ కాశీ విశ్వనాథ్ గారిని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి గారు కలుసుకున్నారు. ఇండస్ట్రీ పెద్ద స్థాయిలో తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కాశీ విశ్వనాథ్ గారి మనస్సులో ఆనంద క్షణాలు చిగురించాయి. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ కాశీ విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 
 
ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాధ్ గారి అభిమానుల్లోనూ దీపావళీ సంతోషాన్ని నింపింది. 
దర్శకులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారి సినిమాలకు ప్రపంచ సినిమా స్థాయి ఉన్న విషయం మనకు తెలిసిందే.
 
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు మాట్లాడుతూ.. విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈరోజు ఆయ‌న ఇంటికి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అంద‌రికీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు అన్నారు.