గల్లీ రౌడీ మూవీ రివ్యూ

Published On: September 18, 2021   |   Posted By:

గల్లీ రౌడీ మూవీ రివ్యూ

సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’రివ్యూ
Rating:2/5

  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్న సందీప్ కిషన్ కు అప్పటి నుంచీ సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ప్రయత్న లోపం లేదు. కామెడీ, యాక్షన్,యాక్షన్ కామెడీ,స్పోర్ట్స్ ఫిల్మ్  ఇలా జానర్స్ మార్చి ట్రై చేస్తున్నాడు. అలాగే తాను నటించిన సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచుతున్నా సినిమా రిలీజ్ అయ్యేసరికి అందులో విషయం లేదని తేలిపోతుంది. మొన్నటికి మొన్న వచ్చిన A1 ఎక్స్‌ప్రెస్ కూడా అదే దారిపట్టింది. ఇప్పుడు తాజాగా  ‘గల్లీ రౌడీ’వచ్చాడు. ఈ వారం థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి భీభత్సమైన ప్రమోషన్స్ చేసారు. సందీప్ కిషన్ పెరఫార్మెన్స్ లోటు లేదు అని చెప్పబడుతున్న ఈ చిత్రం కథేంటి, ఈ సినిమా అయినా సందీప్ కిషన్ ని ఒడ్డున పడేసిందా వంటి విషయాలు చూద్దాం


స్టోరీ లైన్

వైజాగ్ లో ఉండే సింహాచలం(నాగినీడు)కు రౌడీయిజం మంచి పనులుకు వాడితే తప్పేమీ కాదనే కాన్సెప్టు. అతను భైరాగి నాయుడు చేత అవమానింపబడతాడు. అంతేకాదు సింహాచలం కొడుకుని కూడా బైరాగి చంపేసాడు. ఇప్పుడు భైరాగి ఒకటే కసి,కక్ష ..భైరాగి అంతు తేల్చాలని. అందుకు తన మనవడు వాసు (సందీప్ కిష‌న్‌) ని రౌడిగా చేయాలనుకుంటాడు. ట్రైనింగ్ ఇప్పిస్తాడు. కానీ వాసుకు ఇలాంటివి గిట్టవు. సాఫ్ట్ వేర్ అవ్వాలనేది జీవితాశయం.

ఇదిలా ఉంటే అదే వైజాగ్ లో ప‌ట్ట‌ప‌గ‌లు వెంకట‌రావు (రాజేంద్ర ప్ర‌సాద్‌) ఓ హెడ్ కానిస్టేబుల్‌. అతనికి  బీచ్ రోడ్‌లో 2 కోట్ల విలువైన స్థ‌లం ఉంటుంది. దాన్ని బైరాగి  క‌బ్జా చేస్తాడు. అడిగినందుకు దారుణంగా అవ‌మానిస్తాడు.  ఆ క్రమంలో వెంక‌ట‌రావు కూతురు సాహిత్య (నేహా శెట్టి) బైరాగిపై ప‌గ తీర్చుకోవాల‌నుకుంటుంది. తమ రెండు కోట్లూ ఎలాగైనా స‌రే, రాబ‌ట్టాల‌ని ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా వాసు (సందీప్ కిష‌న్‌) స‌హాయం కోరుతుంది. ఆమెతో అప్పటికే ప్రేమలో పడ్డ వాసు సరేనంటాడు. బైరాగిని కిడ్నాప్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేయాలనుకుంటాడు. కానీ ఈ లోగా భైరాగి హత్యకు గురి అవుతాడు. పోలీస్ లు,  భైరాగి కొడుకు వాసు, సాహిత్య కుటుంబ స‌భ్యులు పడతారు.  ఇంత‌కీ బైరాగీని ఎవ‌రు హ‌త్య చేశారు?  ఈ కేసు నుంచి వాసు ఎలా త‌ప్పించుకున్నారు?  వాసు లవ్ స్టోరీ ఏమైంది,ఎనకౌంటర్ స్పెషలిస్ట్ నాయక్ (బాబి సింహా) కథలో పాత్రమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఎనాలసిస్
 
ఆ మధ్యన నాని హీరోగా వచ్చిన  ‘గ్యాంగ్ లీడర్’ ని గుర్తు చేయటమే  ఈ సినిమా కు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో సినిమాపై ఇంట్రస్ట్ పోతుంది. దానికి తోడు సెకండాఫ్ లో అసలు హీరోకు పనేమి ఉండడు. అప్పడప్పుడు వచ్చి కనపడుతూంటాడు. అంతా రాజేంద్రప్రసాద్ చుట్టూనే కథ తిరుగుతంది. రాజేంద్రప్రసాద్ సమస్యలో ఇరుక్కుంటాడు. సందీప్ కిషన్ హీరో అని మర్చిపోయి రాజేంద్రప్రసాద్ ని హైలెట్ చేస్తూ..అతనికే సమస్య పెట్టి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎప్పుడైతే హీరో క్యారక్టర్ ప్యాసివ్ గా మారిందో అక్కడ నుంచే బోర్ స్టార్టైపోయింది. కాంప్లిక్ట్స్ లేని సెకండాఫ్ తేలిపోయింది.

  అలాగే హీరోని  రౌడీ చేసే ప్ర‌య‌త్నాలు అంటే ఫక్తు కామెడీ అనిపిస్తుంది. ఎమోషన్ సింక్ అవ్వలేదు. అదే ఫ్లోలో వెళ్లిపోయినా సరిపోయింది. ఆ కథని థ్రిల్లర్ గా మారుద్దామనే కథలోకి క్రైమ్ ని తీసుకొచ్చారు. ఇవన్ని చాలదన్నట్లు విలన్ ని ఇంటర్వెల్ లో చంపేసారు. సెకండాఫ్ లో విలన్ లేడు. ఇలా ఫస్టాఫ్ కే పూర్తయ్యాక విలన్ తో  పాటు,  కథ చచ్చిపోయింది. దాంతో సినిమా సెకండాఫ్ లో విషయం లేదు. క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్స్ విసిగిస్తూంటాయి. ట్విస్ట్ లు పేలలేదు.  సినిమా పూర్తయ్యాక  బైరాగిని చంపింది ఎవ‌రో అంటూ అస‌లైన ట్విస్ట్ రివీల్ చేసినా వినటానికి ఎవరూ సిద్దంగా లేరు. ఏదైమైనా బ‌ల‌హీన‌మైన క‌థ‌, నీరసంగా సాగే స్క్రీన్ ప్లే తో  గ‌ల్లీ రౌడీ కాస్తా సిల్లీ రౌడీగా మారిపోవాల్సివ‌చ్చింది.

బాగున్నవి

ఫ్రీ ఇంటర్వెల్ సీన్స్

ఫన్నీ టైటిల్‌
వెన్నెల కిషోర్, షకలక శంకర్ ఎపిసోడ్స్
రాజేంద్రప్రసాద్ టైమింగ్
డైలాగులు


బాగోలేనివి

రొటీన్ గా సాగే క‌థ‌, స్క్రీన్ ప్లే
 
నాని ‘గ్యాంగ్ లీడర్’ ని గుర్తు చేయటం

రొమాంటిక్ ట్రాక్


టెక్నికల్ గా…

స్క్రిప్టే ఫెయిలైనప్పుడు మిగతా విభాగాలు ఎలా ఉన్నా పెద్దగా ఏమీ అనిపించదు. ఈ సినిమాలో కథలాగే మిగతా విభాగాలు కూడా ఫరఫెక్ట్ గా అనిపించలేదు. దానికి తోడు డైరక్షన్ ఎనభైల కాలంలో లాగ ఉంది. ఎక్కడా మెరుపుల్లేవు.  రామ్ పాడిన పుట్టెనే ప్రేమా పాట బాగుంది. మిగిలిన పాట‌లూ ఓకే. సినిమా నిడివి త‌క్కువైనా. రెండు సినిమాల్ని ఒకేసారి చూసిన ఫీలింగ్ క‌లిగింది. అదంతా స్క్రిప్టులో ఉన్న లోప‌మే. డైలాగులు బాగున్నాయి. చౌర‌స్తా రామ్ సంగీతంలో రెండు  పాట‌లు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.


నటీనటుల్లో సందీప్‌కిష‌న్  బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఫైట్స్ బాగా చేస్తున్నాడు. ఈజ్ పెరిగింది. కానీ ఇలాంటి కథల వల్ల అతనికి కలొచ్చేదేమీ లేదు. జులాయి తర్వాత   రాజేంద్ర‌ప్ర‌సాద్ మళ్లీ అలాంటి పాత్రలో కనిపించాడు.  నేహాశెట్టి బాగుంది. వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, ష‌క‌లక శంక‌ర్ ఫన్ కూడా బాగుంది. మిమి గోపి విలన్ గా ఉన్నంతసేపు బాగుంది. సెకండాఫ్ లో  బాబీ సింహా చేసిన పాత్ర బాగానే ఉన్నా..బాబి సింహా చేయటం వల్ల పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు.



చూడచ్చా

అక్కడక్కడా కొంత కామెడీ వర్కవుట్ అయ్యింది. ఆ మాత్రం చాలు ఎడ్జెస్ట్ అయ్యిపోతాం అనుకుంటే చూడచ్చు



ఎవరెవరు…

బ్యానర్‌: కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌;
నటీనటులు: సందీప్‌ కిషన్‌, నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిషోర్‌, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: రామ్‌ మిర్యాల, సాయి కార్తిక్‌; సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్‌;
ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌;
 రచన: నందు;
నిర్మాత: కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ;
 స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి;
విడుదల తేదీ: 17-09-2021
రన్ టైమ్: 2గంటలు 23 నిముషాలు