జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ శంకుస్థాపన

Published On: December 27, 2020   |   Posted By:

జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ శంకుస్థాపన

జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కు ఫౌండేషన్ స్టోన్ వేసిన నాగార్జున

మొన్నటి వరకు బిగ్ బాస్ 4 తెలుగు తో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. అక్కడి నుంచి ఫ్రీ అయిన తర్వాత సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు. ఈయన సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు. తాజాగా అయిన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా MD, CEO శ్రీధర్ రావు గారితో కలిసి పాల్గొన్నారు నాగార్జున. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నాగార్జున కాసేపు సేద తీరారు. మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాగార్జున కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు నాగార్జున.

ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పలువురు కాలనీవాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.