తలైవి మూవీ ట్రైలర్ లాంచ్

Published On: March 23, 2021   |   Posted By:

తలైవి మూవీ ట్రైలర్ లాంచ్

దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి పాల్గొన్నారు.

‘ఒక సినిమా నటితో మనకు రాజకీయ నేర్పించాలనుకోవడం.. ఇది మగవారి ప్రపంచం..మగవాళ్లే పాలించాలి.. ఓ ఆడదాని చేతిలో పార్టిని పెట్టి వెనక నిల్చున్నాం’, ‘జయనే వారు వారసురాలిగా చూస్తున్నారు’.. ‘ఈ ప్రజలకు ఏదైనా చేయాలి.. ఈ ప్రజల్లోకి రా..’, ‘నటించి ఇంత మందిని సంతోషపెడుతున్నాను..ప్రజల్లో లేను అంటారా?’, ‘రాజకీయాల్లోకి రా అని అంటున్నా’. నిన్ను గెలవాలని అనుకోవడానికి నువ్ అంత పెద్ద మనిషివేం కాదు.. నిన్న కురిసిన వానకు.. ఇవాళ మొలిచిన గడ్డిమొక్కవి నువ్.. మర్రిచెట్టును ఢీ కొట్టాలని చూడకు’.. ‘ఎవరు మొక్కో ఎవరు చెట్టో కాలమే సమాధానం చెబుతుంది..’, ‘మహాభారతంలో ద్రౌపదికి ఇదే జరిగింది.. తన చీరను లాగి అవమాన పరిచిన కౌరవుల కథ ముగించి జడ ముడిచి శపదాన్ని నెరవేర్చుకుంది.. ఆ మహా భారతానికి ఇంకో పేరు ఉంది అదే జయ..’ ‘నీ విజయమే తమిళనాడు విజయం..’, ‘ఇది పోరాటం.. ప్రజల కోసం పోరాటం.. ప్రాణం పోయే వరకు పోరాడుదాం’, ‘ప్రజలను నువ్ ప్రేమిస్తే.. వారు నిన్ను ప్రేమిస్తారు అదే రాజకీయం’, ‘నన్ను అమ్మగా చూస్తే హృదయంలో చోటు ఉంటుంది.. నన్ను కేవలం ఓ ఆడదానిలా చూస్తే.. ’ అనే డైలాగ్స్ టీజర్‌లో అదిరిపోయాయి. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక నిర్మాతలు, కంగనా రనౌత్, అరవింద్ స్వామి మాట్లాడారు.

అమ్మ గురించి దేశం మొత్తం తెలుసుకోవాలి..

క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తలైవి సినిమా మాకెంతో ప్రత్యేకం. మా ప్రయాణం జీవితాంతం గుర్తుంటుంది. ఎంతో స్ఫూర్తివంతమైన ఈ జీవిత చరిత్రను దేశానికి చెప్పాలనుకున్నాం. జయలలిత అమ్మ గురించి దేశం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్యాన్ ఇండియన్‌గా తెరకెక్కించాం. ఉత్తరాదిలో ఉండే సున్నితత్వం తెలిసిన వారు కాబట్టే ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ టేకప్ చేశారు. ఈ సబ్జెక్ట్‌లో ఉన్న సెన్సిటివిటీ తెలిసిన వారు కనుకే ఇంత గొప్పగా తీశారు. విజయేంద్ర ప్రసాద్ గారు మా ఐడియాకు ప్రాణం పోశారు. ఎన్నో సలహాలు ఇచ్చారు. భారత సినీ చరిత్రలో కంగనా రనౌత్ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రను పోషించడంలో ఆమె కంటే మేటి ఎవ్వరూ లేరు. కుదోస్ టు కంగనా. ఎంజీఆర్ గారి గురించి చెప్పకుండా జయలలిత చరిత్రను చెప్పలేం. ఆయన లేకుంటే అది అసంపూర్ణంగా ఉంటుంది. అరవింద్ స్వామి కంటే గొప్పగా ఆ పాత్రను పోషించేవారు ఇంకెవ్వరూ లేరు.’ అని అన్నారు.

నిజ జీవితంలోనూ కంగనా తలైవి..

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తలైవి కథ, విజయ్ నా వద్దకు వచ్చారు.. వారు నాకు ఇచ్చిన మెటీరియల్ అద్భుతం. అయితే అప్పుడు ఈ కథకు న్యాయం చేసేది ఎవరని అనుకున్నాం. కంగనాను కథ చెప్పాం. ఆమె వెంటనే ఓకే చెప్పారు. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలి ఎలా నటించాలి అని కంగనా అడిగారు. నువ్ నటించకు.. నువ్ నీలా ఉండు.. ఎవరి ముందు తలవంచని ఆ తత్త్వం, ఎవ్వరినైనా ఎదురించే ధైర్యం. అదే జయలలిత. అవన్నీ నీలో ఉన్నాయ్ అని చెప్పాను. మణికర్ణిక సినిమాతో మా ప్రయాణం మొదలైంది. కంగనాకు నిన్ననే జాతీయ అవార్డు వచ్చింది.. తలైవి అంటే లీడర్.. నిజ జీవితంలోనూ కంగనా ఓ గొప్ప నాయకురాలు అవుతుంది.. ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతుంది’ అని అన్నారు.

రాజకీయ కోణంలోంచి చూడకండి..

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. ‘ఇది మా అందరికీ ఎంతో మంచి రోజు. విష్ణు, బృందలకు థ్యాంక్స్. నన్ను నమ్మి నాకు చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ ఇంత ముందుకు రావడానికి కారణం విజయేంద్ర ప్రసాద్. ఆయన కథ, కథనం రాయడంలో మాస్టర్. ఆయన దగ్గరకు వెళ్తుంటే.. స్కూల్‌కి వెళ్లి నేర్చుకున్నట్టు అనిపించింది. అరవింద్ స్వామి గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఆయన నటనే ఈ సినిమాకు వెన్నెముక. సంగీత దర్శకుడు జీవితో నా ప్రయాణం విడదీయలేనిది. ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. మదన్ నాకు సోదరుడి వంటి వారు. సముద్రఖని సర్ అద్భుతంగా నటించారు. ఆయనతో పోటీ పడి నటించేందుకు సీన్స్ ఎప్పుడు ఉంటాయని కంగనా అడిగేవారు. నాలుగు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమెతో పని చేయడం నా అదృష్టం. కథను, కథనాన్ని ఎంతో గొప్పగా అర్థం చేసుకుంటారు. నెక్ట్స్ సీన్ ఏంటని అర్ధరాత్రి కూడా అడుగుతుంటారు. సినిమా కోసం ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డారు.  ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమాను రాజకీయ కోణాల్లోంచి చూడకండి.. పురుషాధిప్యతంలోంచి ఓ మహిళ ఎలా నిలబడింది.. ఎలా విజయం సాధించింది అనేది చూపించాం’ అని అన్నారు.

ఇద్దరం తలైవి అని రాసేశాం..

నిర్మాత విష్ణు వర్దన్ ఇందూరి మాట్లాడుతూ.. ‘ముందు సినిమా చేయాలని ఫిక్స్ అయినప్పుడు విజయ్ నేను కలిశాం.. ఇద్దరం చెరో టైటిల్ రాసుకున్నాం. ఇద్దరం తలైవి అని రాసేశాం. అప్పుడే మేం ఇద్దరం సింక్‌లో ఉన్నామని తెలిసింది. ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్‌ను కలిశాం. ఆ తరువాత కంగనా గారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. తలైవి సినిమాకు వస్తే నేను ఎమోషనల్ అవుతుంటాను’ అని అన్నారు.

ఇది సమష్టి కృషి..

అరవింద్ స్వామి మాట్లాడుతూ.. ‘ఇలా అందరినీ చూసి ఏడాది ఏడాదిన్నర అవుతుంది. తలైవి సినిమాలో నాకు చాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. కరోనా కష్టాలను అధిగమించి ఏప్రిల్ 23న ఈ మూవీని తీసుకొస్తున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. జయలలిత, ఎంజీఆర్అంటే ఐకానిక్ పాత్రలు. ఇందులో నాకు చాన్స్ ఇచ్చినందుకు విజయ్‌కి థ్యాంక్స్. సినిమాకు పని చేసిన విజయేంద్ర ప్రసాద్, జీవి, మదన్ ఇలా అందరికీ థ్యాంక్స్. అందరూ కలిసి సమష్టిగా పని చేశారు కాబట్టే ఇంత బాగా వచ్చింది. నిన్ననే జాతీయ అవార్డ్ వచ్చింది. కంగనాకు కంగ్రాట్స్. నాజర్‌తో గారితో మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నాను. తంబి రామయ్యతో తన్నిఒరువన్ సినిమాలో పని చేశాను. సముద్రఖనితో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇష్టపడి చేస్తే ఏది కష్టంగా అనిపించదు. టీజర్ బయటకు వచ్చాక అందరూ ఎంజీఆర్ లుక్‌పై ప్రశంసలు కురిపించారు. ఎంతో కష్టపడ్డావ్ అని అందరూ అన్నారు కానీ నేను ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు.

ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలడం లేదు..

కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘నేడు నా పుట్టిన రోజు. జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. నా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను రికమండ్ చేయకపోయి ఉంటే.. ఈ చాన్స్ వచ్చేది కాదు. నా జీవితంలో మొదటి సారి ఇలా ఒకరు రికమెండ్ చేశారు. నేను ఈ పాత్రకు సరిపోతాను అని మీరు ఎలా అనుకున్నారు అని దర్శకుడు విజయ్‌ని అడిగాను. క్యాస్టింగ్ సరిగ్గా లేకపోతే సినిమా ఆడదు అని ఆయనకు చెప్పాను. కానీ విజయ్ నన్ను ఒప్పించారు. ఈ సినిమా బృందగారి వల్లే మొదలైంది. మగవారు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు సూపర్ స్టార్స్ ముందుకు రారు. కానీ అరవింద్ స్వామి లాంటి పెద్ద హీరోలు ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ . ఎంతో మంది మహిళలు మగవారికి అన్నింట్లో సపోర్టివ్‌గా ఉంటారు. సూపర్ స్టార్స్ ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని, వారిని సపోర్ట్ చేసే రోజులు బాలీవుడ్‌లో కూడా వస్తాయని ఆశిస్తున్నాను. దక్షిణాదిలో నెపొటిజం, గ్రూపిజం, గ్యాంగిజం లాంటివి లేవు. నేను ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్లను. ఇక్కడే ఉంటాను. ఇంకా చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా దర్శకుడి గురించి చెప్పాలంటే మాటలు చాలడం లేదు. నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా నన్ను నవ్విస్తుంటారు. ఆయన లాంటి వ్యక్తిని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.