దర్శకుడు మణికాంత్ ప్రెస్‌మీట్

Published On: March 26, 2021   |   Posted By:
దర్శకుడు మణికాంత్ ప్రెస్‌మీట్
 
తెల్లవారితే గురువారం కథ మీద నాకు నమ్మకం ఉంది -దర్శకుడు మణికాంత్.

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు మణికాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక పోవడంతో ఉద్యోగం చేశాను. తమ్ముడు సెటిల్ అయ్యాడని సినిమా ప్రయత్నాలు చేశాను. ఇక అంతలోపే ప్రేమ్ వివాహం చేసుకోవడం తో కష్టాలు మొదలయ్యాయి. అయితే నా భార్య ఆర్థికంగా తోడు నిలిచింది. ఆమె ప్రోత్సాహoతో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా శ్రీమతి పేరు మధు. ఆవిడ పేరునే ఓ హీరోయిన్‌కు పెట్టాను.  

* చాలా సినిమాలకు పని చేశాను. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమాకు అసిస్టెంట‌ గా అజయ్ భూపతి వద్ద పని చేశాను. ఆ మూవీ తరువాత నన్ను సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టమని అజయ్ సలహా ఇచ్చాడు. అలా ఈ కథను పట్టుకుని తిరిగాను.

* నా ఫ్రెండ్ రంగస్థలం కోసం రత్నవేలు వద్ద అసిస్టెంట్‌గా పని చేశాడు. అదే సినిమాకు సింహా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నేను కొత్త హీరో కోసం ట్రై చేస్తున్నా అని తెలిసి నా ఫ్రెండ్ ఈ కథను సింహాకు చెప్పమన్నాడు.

* అలా సింహా కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు. అంతా పది రోజుల్లోనే సెట్ అయింది. నిర్మాత సాయి, కలర్ ఫోటో నిర్మాతలకు నచ్చడంతో సంయుక్తంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అలా పది రోజుల్లోనే చెక్ ఇచ్చేశారు.

* అలా గతేడాది ఫిబ్రవరిలోనే అంతా ఓకే అయింది. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది.కానీ కరోనా వచ్చి పడింది. దీంతో అంతా తారుమారైంది. మళ్లీ పిలుస్తారో లేదో అనుకున్నాను. కానీ నవంబర్ కాల్ చేశారు. అలా నవంబర్‌లో సినిమాను మొదలు పెట్టి మార్చి 27కు తీసుకొస్తున్నాం.

* చిత్రా శుక్లా ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. నిమిషా కొత్త అమ్మాయి. అయితే అందరికీ ముందు కొన్ని రోజులు వర్క్ షాప్ చేశాం. ప్రతీ షాట్, కాస్ట్యూమ్స్, లెన్స్‌తో సహా చెప్పేసరికి నా మీద నిర్మాతలకు నమ్మకం ఏర్పడింది.

* స్టార్ ఫ్యామిలీ హీరోతో పని చేస్తున్నామనే భయం ఏమీ లేదు. నా కథ మీద నాకు నమ్మకం ఉంది. వారు కూడా అదే నమ్మారు. ఈ సినిమాను ఇప్పటికీ ఎవ్వరూ చూడలేదు. కీరవాణి, రాజమౌళి ఫ్యామిలీలందరూ కూడా రేపే చూడబోతోన్నారు. కథ, మాటలు అన్నీ కూడా నా ఫ్రెండ్‌ నాగేంద్రవే. ఈ సినిమాకు కేవలం నేను దర్శకుడిని మాత్రమే.

* సినిమా అంతా గోదావరి నేటివిటీలోనే ఉంటుంది. సత్య, సింహా కాంబోలో వచ్చే సీన్స్‌కు థియేటర్లు పగలబడి నవ్వుతారు. ఏ సినిమాకైనా కూడా సంగీతం ప్రాణం. పాటలు బాగున్నాయంటే సినిమా మీద అంచనాలు ఏర్పడతాయి. సందర్భాన్ని బట్టి మూడు పాటలను పెట్టాం. ఆడియో వల్లే సినిమా స్థాయి పెరిగింది.

* తెల్లవారితే గురువారం సినిమా తరువాతే తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి నా మైండ్‌లో రెండు కథలున్నాయి. నాకు పర్సనల్‌గా నిన్నే పెళ్లాడుతా సినిమా అంటే ఇష్టం. అలా లైవ్లీగా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే సినిమాలంటే నాకు ఇష్టం. పోలీస్ స్టోరీ, కమర్షియల్ కథను రాయాలని అనుకుంటున్నాను. ఏది రాసినా కూడా ఎంటర్టైన్మెంట్, గోదావరి వెటకారం మాత్రం వదలను.

* కథను బట్టే వెళ్తుంటాం. ఇప్పుడు కూడా కొత్త మొహం కోసం చూశాను. అలా సింహాతో ఈ సినిమా సెట్ అయింది. అలా కథను బట్టే చేస్తాను. కానీ ఎప్పటికైనా తారక్ గారితో ఓ సినిమా చేయలనేది నా కల.

* కరోనా వల్ల రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయలేకపోయాం. ఇక్కడే సెట్ వేసి షూటింగ్ చేసేశాం. ఈ సినిమా కోసం తారక్ గారు ఎలాగోలా ఉండాలని నిర్మాత సాయిని పట్టుబట్టాను. మొదట్లో వాయిస్ ఓవర్ కూడా పెట్టిద్దామని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలిపించారు.

* నిర్మాత సాయి గారు సినిమాకు ఏం కావాలో అదే ఇస్తుంటారు. షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఏది కావాలన్నా చేస్తారు. కానీ ఒక్క సారి షూట్ స్టార్ట్ అయ్యాక ఇన్వాల్వ్ అవ్వరు.

* ఆది, నిన్నే పెళ్లాడుతా సినిమాలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. నిట్ వరంగల్‌లో ఫోటోగ్రఫీ క్లబ్‌లో మెంబర్‌ని. షార్ట్ ఫిలిమ్స్ అప్పుడే మొదలయ్యాయి. అలా నేను కూడా అటు వైపు వెళ్లాను.

* ఈ కథ అజయ్ భూపతికి తెలుసు. నీకు నచ్చితే చెయ్. వేరే వాళ్ల గురించి నీకు ఎందుకు అని అంటారు. నా వెనకాల అజయ్ భూపతి గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.