నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూ

Published On: March 10, 2020   |   Posted By:

నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూ

నటుడు బాలాదిత్య ఇంటర్వ్యూగ్యాప్ తీసుకోలేదు..నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మాత. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అతి త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా బాలాదిత్య ఇలా ముచ్చటించారు.

సినిమాలతో నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. 2009లో నటించిన ‘1940లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. తర్వాత సినిమాలకు  కావాలని గ్యాప్ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ కోసం దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాను. ఈ గ్యాప్ లో నాపై చాలా అపోహలు వచ్చాయి. ఇండస్ట్రీ వదిలి సింగపూర్, మలేషియా వెళ్లిపోయానని కూడా వదంతులు  వచ్చాయి. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నాను. చంటిగాడు సినిమా టైంలో నాకు 17ఏళ్లు. తర్వాత అమ్మకిచ్చిన మాటకోసం చదవడానికి బ్రేక్ తీసుకున్నాను. ఐదేళ్ల గ్యాప్ లో చాలామంది నన్ను మర్చిపోయారు. మళ్లీ ఇండస్ట్రీకి వచ్చానని తెలిసిన వాళ్లందరికీ తెలియజేశాను. నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకి ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించాను. తర్వాత నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనువడు’ సినిమాలో కీలక పాత్రన పోషించాను. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు మా క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. పూర్తి సినిమాటిక్ గా చిత్రీకరించారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు. సెకండాఫ్ లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది.  పాపులారిటీ ఉన్న వ్యక్తుల బయోపిక్ లో నటిస్తే వారిగురించి నటించే ముందు మొత్తం తెలుసుకుంటాం. కానీ ప్రణయ్ గురించి నటించిన తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి.  ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్ లో నటిస్తున్నాను. ఈటీవీలో వచ్చే ఛాంపియన్ కార్యక్రమం ద్వారా  నేను మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాను. టీవీ, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. పెద్దవాళ్లే బుల్లితెరపై కనిపిస్తున్నారు ..మనం కన్పిస్తే తప్పేముంది అనుకుని ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. చిరంజీవి, నాగార్జున లాంటి వారు సైతం టీవీ షోస్ చేస్తున్నారు. నటించేవారికి టీవీ షో అయినా, సీరియల్ అయినా, వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా ఏదైనా ఒకటే. ఏదైనా కెమెరా ముందు నటించాల్సిందే. ప్రస్తుతం తమిళ్ లో రాసాతి అనే సీరియల్ లో నటిస్తున్నాను. సన్ నెట్ వర్క్ ప్రైమ్ టైంలో ఆ సీరియల్ వస్తుంది. సీరియల్స్ లోకూడా ప్రేక్షకులు రొటిన్ కార్యక్రమాలు చూడటం లేదు. కొత్త కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఆర్టిస్ట్ గా ఆ సీరియల్ లో నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకున్నది చెన్నైలోనే కారణంగా తమిళ్ కూడా నాకు వచ్చు. ఇటీవల జీ5లో గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సీరిస్ లో చేశాను. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు.