విక్రమ్ గౌడ్ చిత్రం టీజర్ విడుదల

Published On: December 7, 2021   |   Posted By:

విక్రమ్ గౌడ్ చిత్రం టీజర్ విడుదల

ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘విక్రమ్ గౌడ్’ టీజర్
 
శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని పాశం నరసింహారావు దర్శకత్వంలో సుహాసిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్ డిఎస్‌కె స్క్రీన్ స్టూడియోస్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రముఖ నిర్మాత, నటుడు డి.ఎస్. రావ్ విడుదల చేశారు. నేటి ప్రపంచానికి అద్దం పట్టేలా ఉన్న ఈ టీజర్‌ అద్భుతంగా ఉందని, 2022 ప్రథమార్థంలో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలబడుతుందని తెలుపుతూ ప్రతాని, డిఎస్ రావ్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
టీజర్ విషయానికి వస్తే.. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం..’ అనే పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ నేటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంటే ‘మళ్లీ తెలుగు రాష్ట్రం అంతా ఒకటే కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని’ చెప్పడం సరికొత్త ఆలోచనలని రేకెత్తిస్తోంది. డేటింగ్‌కి ఒకరు, చాటింగ్‌కి మరొకరు, నిశ్చితార్థానికి ఇంకొకరు.. అని హీరో కిరణ్ రాజ్ చెప్పే డైలాగ్ నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తుంది. హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ.. హీరో చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ‘‘ముఖేష్ అంబానీ వజ్రపు బియ్యం, రామోజీరావు బంగారు బియ్యం తిన్నా తినేది మాత్రం గుప్పెడు బియ్యమే కదా..’’ అనే డైలాగ్ ఈ టీజర్‌కే హైలెట్. అలాగే ‘‘26 అక్షరాలతో తయారైన పరాయి భాషలోనే అన్ని బూతులుంటే 56 అక్షరాలతో తయారైన రాజభాష‌లో ఇంకెన్ని ఉంటాయో ’’ అని హీరో విరోచితంగా చెప్పే డైలాగ్ తెలుగు భాష‌ని తక్కువ చేసే వారికి చెంపపెట్టులా ఉంది. ఓవరాల్‌గా పవర్ ఫుల్ డైలాగ్స్‌, యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. అలాగే హీరో కిరణ్ రాజ్‌కి ఇది తొలి చిత్రం అంటే ఎవరూ నమ్మరు. ఒక స్టార్ హీరోలా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.
 
టీజర్ విడుదల అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. కొత్తవాళ్లు ఈ సినిమా చేసినట్లు అనిపించలేదు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. హీరో చాలా బాగున్నాడు. మంచి భవిష్యత్ ఉంటుంది. విక్రమ్ అనే టైటిల్‌లోనే విజయం ఉంది. యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఈ చిత్రానికి ఎటువంటి సహకారం అయినా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న సినిమాలకు పెద్ద సపోర్ట్ చేసే వ్యక్తులలో నేనూ ఒకరిని. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.
 
డి.ఎస్. రావు మాట్లాడుతూ.. ‘‘ విక్రమ్ గౌడ్ మంచి సౌండ్‌తో వస్తున్న సినిమా. ప్రతానిగారితో కలిసి ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్‌ చూస్తుంటే పొలిటికల్ టచ్‌తో మంచి ఎమోషన్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది. ‘మంత్ర’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ చాలా బాగుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి ప్రేక్షకాదరణ పొంది చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ‘మంత్ర’ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ మా చిత్రం ‘విక్రమ్ గౌడ్’ టీజర్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్, డి.ఎస్. రావ్ గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా చాలా బాగుంటుంది. పొలిటికల్, ఎమోషనల్‌గా అనిపించినా మంచి లవ్ స్టోరి ఇందులో ఉంది. మేము కూడా చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా వేచి చూస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకి వర్క్ చేయడం నిజంగా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. ప్లాన్‌డ్‌గా ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సినిమాని అందరూ ఆదరించి, దర్శకులు నరసింహారావుగారిని, మా టీమ్‌ మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు.
 
దర్శకుడు పాశం నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన పెద్దలు ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి, డిఎస్ రావ్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘విక్రమ్ గౌడ్’ సినిమాలో మీరు ఊహించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా లవ్, సెకండాఫ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడుస్తుంది. చివరి 25 నిమిషాలు అయితే ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు చేరి ఎగ్జయిట్ అవుతారు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం 5 సాంగ్స్ చిత్రీకరణ అయిపోయింది. ఇంకో సాంగ్ చిత్రీకరించాలి. 2022లో ఇది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అందులో డౌటే లేదు. కథ, నటీనటుల నటన అన్నీ అద్భుతంగా ఉంటాయి. హీరో కిరణ్ రాజ్ చాలా కసిగా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే ఆయన పరిచయం అవుతున్నారు. ఎడిటర్ జానకి రామ్ గారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలబడి సహకరించారు. ఆనంద్‌గారు మంచి పాటలు ఇచ్చారు. మేము అడిగిన ప్రతీది సమకూర్చి.. నిర్మాత ఎంతో సహకారాన్ని అందించారు. 2022 ఫస్ట్ క్వార్టర్‌‌లో ఈ సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. సినిమా చూసి, ఎంజాయ్ చేసి.. మమ్మల్ని ఆశీర్వదించండి..’’ అని అన్నారు. 
 
కిరణ్ రాజ్, దీపికా సింగ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: ‘మంత్ర’ ఆనంద్
ఎడిటర్: జానకిరామ్
సినిమాటోగ్రఫీ: రాఘవేంద్ర. బి. కోలార్
నిర్మాత: సుహాసిని
కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: పాశం నరసింహారావు