సూర్యగా వస్తున్న నట్టి క్రాంతి

Published On: May 2, 2020   |   Posted By:
సూర్యగా వస్తున్న నట్టి క్రాంతి 
 
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఇప్పుడు ‘సూర్య’ చిత్రం ద్వారా  హీరోగా పరిచయమవుతున్నారు. దీని ద్వారా ఉమామహేశ్వరరావు దర్శకుడిగా  పరిచయమవుతున్నారు. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్,  క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ నిర్మిస్తున్నారు. 
లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం చిత్రీకరణ కొంతభాగం పూర్తయింది. కాగా ఈ చిత్రంలోని “నిజమేనా…” అంటూ సాగే పాటను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటీనటులు కస్తూరి, శివబాలాజీ, మధుమిత విడుదలచేశారు. అనంతరం వారంతా పాట చాలా బావుందని ప్రశంసిస్తూ… నట్టి క్రాంతి హీరోగా కూడా సక్సెస్ కావాలని అభినందనలు తెలిపారు. 
ఈ సందర్భంగా హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ, “నాన్న సినీరంగంలో ఉన్నారని కాకుండా చిన్నప్పటి నుంచి ఈ రంగం పట్ల ఎనలేని ఇష్టం ఏర్పడింది. అందులో భాగంగానే పదహారేళ్ళ వయసులోనే ఓ వైపు చదువుకుంటూనే అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాను. అటుపిమ్మట అమెరికా లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాను. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కూడా నటనలో  శిక్షణ తీసుకున్నాను. గత ఏడాది నిర్మాతగా మారి మా సోదరితో కలసి సినిమాలు నిర్మిస్తున్న నేను తొలిసారి హీరోగా ఈ సినిమా చేస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ నా పై చూపించాలని కోరుకుంటున్నా” అని అన్నారు. 
నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ,  “తమ్ముడు క్రాంతిని హీరోగా పరిచయం చేయడం చాలా చాలా ఆనందంగా వుంది. గీతం యూనివర్సిటీలో సైకాల జీ కోర్సు పూర్తి చేసిన నేను ముద్ర సినిమాతో  నిర్మాతగా మారను. అప్పట్నుంచి వరసగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇక  ఇది చక్కటి ప్రేమకథ చిత్రం. అల్లరి చిల్లరగా తిరిగే ఓ గల్లీ కుర్రాడు ప్రేమలో పడిన నేపథ్యంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి అన్న అంశాన్ని ఎంతో హృద్యంగా, ఆసక్తికరంగా చూపించబోతున్నాం. పాటలు, అలాగే నేపథ్య సంగీతం అలరిస్తుంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మిగతా చిత్రీకరణను పూర్తిచేస్తాం” అని చెప్పారు. 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వల్లీ ఎస్.కె., సంగీతం: సుకుమార్ పి, కథ, మాటలు: నట్టి క్రాంతి, ఉమామహేశ్వరరావు, స్క్రీన్ ప్లే: నట్టి క్రాంతి, సమర్పణ: నట్టికుమార్, నిర్మాత: నట్టి కరుణ, దర్శకత్వం: ఉమామహేశ్వరరావు.