దర్శకుడు సుకు పూర్వాజ్ మీడియా సమావేశం

Published On: August 16, 2022   |   Posted By:

దర్శకుడు సుకు పూర్వాజ్ మీడియా సమావేశం 

మల్టీజానర్ మూవీగా  “మాటరాని మౌనమిది” ఆకట్టుకుంటుంది – దర్శకుడు సుకు పూర్వాజ్

సస్పెన్స్ థ్రిల్లర్ “శుక్ర” చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుకు పూర్వాజ్. ఆయన తన ద్వితీయ ప్రయత్నంగా రూపొందించిన సినిమా “మాటరాని మౌనమిది”. రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ బ్యానర్స్ నిర్మించాయి. మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ హీరో
హీరోయిన్లుగా నటించారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన “మాటరాని మౌనమిది” సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర  విశేషాలు తెలిపారు దర్శకుడు సుకు పూర్వాజ్.

– నా తొలి సినిమా శుక్ర షూటింగ్ లో ఉండగానే ఆ సినిమా మేకింగ్, రషెస్ చూసి ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. శుక్ర విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి “మాటరాని మౌనమిది” సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాం. మనం సాధారణంగా సినిమాకు వెళ్తే దానిలో ఫిక్షన్,
థ్రిల్లర్,  హారర్ ఇలా ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ చిత్రంలో అలాంటి అంశాలను కలిపి మల్టీ జానర్ మూవీగా చేశాం. ఇందులో రెండు హాంటెట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. నవ్వించే ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పటికే కొన్నిప్రివ్యూ షోస్ వేశాం. చూసిన వాళ్లంతా చాలా బాగుందన్నారు. మాకూ సినిమా మీద మంచి నమ్మకం ఉంది.

– ఇలా మల్టీజానర్ తరహాలో మేకింగ్ లో నాకు అనుభవం ఉంది. గతంలో షార్ట్ ఫిలింస్ చేశాం, అవి బాంబే, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అయ్యాయి. ఒక జానర్ చిత్రాలతో మెప్పించడం కష్టం. క్యారెక్టర్స్ సరిగ్గా రాలేదనో, ల్యాగ్ ఉందనో పది నిమిషాల్లో సినిమాను తేల్చేస్తారు. కానీ ఇలాంటి సినిమాల్లో జానర్స్ మారుతుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ కొనసాగుతూ ఉంటుంది.

– ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే పోస్టర్స్ డిజైన్ దగ్గర నుంచి కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. కొత్త హీరో హీరోయిన్లతో పోస్టర్ చేస్తే మిగతా వాటిలాగే అనుకుంటారు. ఈ విషయంలో నాకు దర్శకుడు రవిబాబు స్పూర్తి. ఆయన కుక్క పిల్లలతో, ఏనుగులతో పోస్టర్స్ చేస్తారు.

– ముందు ఈ కథను మూకీ ఫార్మేట్ లో చేద్దామని అనుకున్నాం. అప్పట్లో మూకీ లో పుష్పక విమానం సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. ఇప్పుడు చేస్తే కొత్తగా ఉంటుంది అనుకున్నాం. నిర్మాతలు ఈ కథలోని పాత్రలు మాట్లాడితే బాగుంటుంది చూడండి అన్నారు. అలా ఆ కథనే మార్చి చేశాం. రెండు మేజర్ క్యారెక్టర్స్ కు సంభాషణలు ఉండవు. అనుకోని పరిస్థితి ఎదురైతే వాళ్లు ఎలా ఆ సందర్భాన్ని ఎలా
ఇతరులకు కన్వే చేస్తారు అనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది.

– మహిళ అంటే మనకు భరతమాత దగ్గర నుంచి అందరు దేవతలు గుర్తొస్తారు.వాళ్లంటే మనకో ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే భావోద్వేగంగా సాగుతుంది. ఆమె పాత్ర 1986 కాలం, ప్రస్తుత కాలంలో ఉంటుంది.  ప్లాష్ బ్యాక్ లో మాటలు రావు, ప్రెజంట్ లో వస్తాయి. కథలో ఐదారు
మలుపులు ఉంటాయి. ఇవన్నీ ఒక శాస్త్రీయ అంశంతో ముడిపడి ఉంటాయి.

– నాయిక పాత్రలో సోనీ శ్రీవాస్తవ మెప్పిస్తుంది. ఆమె వైజాగ్ అమ్మాయి,బెంగళూరులో ఉంటోంది. హీరో మహేష్ దత్త అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్.వీళ్లిద్దరు మెయిన్ పెయిర్ గా చేశారు. అర్చనా అనంత్, సునీల్ శెట్టి తప్ప మిగతా అందరూ కొత్త నటీనటులే ఉంటారు.

– ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఆకర్షణ అవుతుంది. మల్టీ జానర్ ఫిల్మ్ కాబట్టి సంగీతం కూడా వైవిధ్యంగా ఉండాలి. అషీర్ లూక్, ఆశీర్వాద్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. నాతో శుక్ర సినిమాకు పనిచేశారు. అనుభవం గల మ్యూజీషియన్స్ వీరు. బాలీవుడ్ లో ఓం శాంతి ఓం, తెలుగులో బాహుబలి, జాంబీ రెడ్డి వంటి పెద్ద చిత్రాలకు పనిచేశారు. అయితే టైటిల్స్ లో వాళ్ల క్రెడిట్స్ ఉండవు.అంత అనుభవం గల వాళ్లు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ బాగా చేశారు.

– చందూ అనే ఫిల్మ్ జర్నలిస్ట్ ను ఈ సినిమాలో ఒక కీ రోల్ కు తీసుకున్నాం.అతను సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. అతని పాత్ర నవ్వించేలా సాగుతుంది.

– మన సినిమాల్లో లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నా వాటిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి నాకు థ్రిల్లర్ మూవీస్ చేయడం అంటే ఇష్టం. త్వరలో మాఫియా, యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను.ఇలాంటి సినిమాలకు మంచి బడ్జెట్ దొరకాలి, పేరున్న ఆర్టిస్టులు కుదరాలి.
అప్పుడే అవి బాగుంటాయి. రెండు మూడు బ్యానర్స్ తో నా నెక్ట్ ఫిల్మ్ కు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ వివరాలు చెబుతా.