నిర్మాత‌గా మారిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌

Published On: March 1, 2019   |   Posted By:

ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుంచాలంటే మూడు ముఖ్యాంశాలు కావాలి.. అందులో ఒకటోది క‌థ‌, రెండోది క‌థ‌, మూడోది కూడా క‌థే. ప్ర‌పంచ‌ప్రఖ్యాత ఫిల్మ్ మేక‌ర్ ఆల్ఫ్ర‌డ్ హిచ్ కాక్ చెప్పిన ఈ మాట‌ల్ని స్పూర్తిగా తీసుకుంటూ, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ మ‌రియు అత‌ని స‌న్నిహితులైన శివ‌మేక‌, రాకేష్ మంహ‌కాళి సంయుక్తంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ పేరిట ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్థాపించారు. సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుద‌ల చేసే ప‌ద్ధ‌తికి పూర్తి భిన్నంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ అడుగులు వేస్తోంది. ఔత్సాహికులైన ర‌చ‌యిత‌ల్ని, సినిమా  క‌థ‌లు రాయ‌గలిగే స‌త్తా ఉన్న యువ ఫిల్మ్ రైట‌ర్స్ ని ప్రొత్స‌హిస్తూ వారి చేత కొత్త కొత్త క‌థ‌ల్ని త‌యారుచేయించ‌డం త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఒక్క మాట‌లో చెప్పాలంటే, ర‌చ‌యిత మేథ‌లో పుట్టిన విత్త‌నాన్ని(సింగిల్ లైన్) జాగ్ర‌త్త‌గా పెంచి పోషించి మ‌హా వృక్షంగా(పూర్తి స్క్రిప్ట్) మార్చడం మ‌హి వి రాఘ‌వ‌, మిత్ర బృందం ముఖ్య ఉద్దేశం. క‌థ‌ల‌కి, క‌థ‌కుల‌కి డ‌బ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్ ని ప‌లు నిర్మాణ సంస్థల‌తో క‌లిసి నిర్మించేందుకు కూడా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ ముందుంటుద‌ని మ‌హి వి రాఘ‌వ తెలిపారు. ఇటీవలే విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకున్న యాత్ర సినిమాకి కో ప్రొడ్యూసర్ గా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ వ్య‌వ‌హ‌రించింద‌ని, ఆ చిత్రంలో క‌థ‌కు ప‌ట్టం క‌ట్టిన తెలుగు ప్రేక్ష‌కుల అంతః అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే త్రీ ఆట‌మన్ లీవ్స్ ద్వారా క‌థ‌ల్ని ముందుగా కాగితాల పై నిర్మించి ఆ త‌రువాత ప‌లు నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి తెర పై నిర్మించే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు మ‌హి, నిర్మాత‌లు శివ మేక‌, రాకేష్ మ‌హంకాళి తెలిపారు. త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ ప్ర‌స్తుతం ఔత్సాహికులైన ర‌చ‌యిత‌ల్ని, కొత్త క‌థ‌ల్ని ప్రొత్స‌హించే నిర్మాణ సంస్థ‌ల‌తో భాగ‌స్వాములు అయ్యేందుకు ముందుంటుంద‌ని, అలానే కేవ‌లం సినిమాల‌నే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట‌రీలకి సంబంధించిన ర‌చ‌యిత‌లు, ఫిల్మ్ మేక‌ర్స్, నిర్మాణ సంస్థ‌లు, ఛాన‌ల్ పార్ట‌న‌ర్స్ తో జ‌త‌క‌లిసేందుకు త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ స‌ముఖంగా ఉంద‌ని మ‌హి వి రాఘ‌వ తెలిపారు.