నిర్మాత ఎస్‌కేఎన్‌ మీడియా సమావేశం

Published On: July 7, 2021   |   Posted By:
నిర్మాత ఎస్‌కేఎన్‌ మీడియా సమావేశం
 
 
సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ ఫ్లాట్‌ఫామ్స్‌ రీ ప్లేస్‌ చేయలేవు – నిర్మాత ఎస్‌కేఎన్‌
 
‘ఈ రోజుల్లో..’ వంటి హిట్‌ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ‘‘టాక్సీవాలా’ వంటి హిట్‌ చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్‌. ఆయన పుట్టినరోజు జూలై 07. ఈ సందర్భంగా తాను ప్రస్తుతంచేస్తున్న ప్రాజెక్ట్‌లు, భవిష్యత్‌ ప్రణాళికలు, తన కెరీర్‌ను గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎస్‌కేఎన్‌ మీడియాతో పంచుకున్నారు..ఆ విశేషాలు….  
                                                                                                                                                                     
– ‘టీవీ 9’లో జర్నలిస్టుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత అల్లుఅర్జున్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్‌ హీరోలకు పీఆర్వోగా పని చేశాను. ఆ తర్వాత  మారుతి దర్శకుడిగా  పరిచయం అయిన తొలి చిత్రం ‘ ఈ రోజుల్లో…’తో నిర్మాతగా నా ప్రయాణం కూడా మొదలైంది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను.
 
విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘టాక్సీవాలా’తో అగ్ర  హీరోలతో సినిమా చేసిన పూర్తిస్థాయి నిర్మాతగా ఓ విజయవంతమైన ముందడుగు వేశాను. సాయిధరమ్‌ తేజ్‌ హిట్‌ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నాను.
 
ప్రస్తుతం హీరో గోపీచంద్, దర్శకులు మారుతి, హీరోయిన్‌ రాశీఖన్నా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
అలాగే దర్శకుడు మారుతి అండ్‌ టీమ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఓ సినిమాను నేను, యూవీ క్రియేషన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాం. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  మారుతి గారు వెల్లడిస్తారు.
 
రచయిత, దర్శక– నిర్మాత సాయి రాజేష్‌తో అసోసియేటై మూడు సినిమాలు చేయనున్నాను.
 
అలాగే ‘కలర్‌ఫోటో’ దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత తెలియజేస్తాం.
 
‘టాక్సీవాలా’ డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యాన్, వీఐ ఆనంద్, ‘పలాస ఫేమ్‌ కరుణ్‌ కుమార్‌లతో సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా  ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ‘త్రీ రోజేస్‌’, జీ5, ఓ ఇంటర్‌నేషనల్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సిరీస్‌ గురించిన చర్చలు తుదిదశలో ఉన్నాయి. కొత్త ప్రతిభావంతులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో మారుతిగారు, నేను కలిసి మాస్‌ మూవీ మేకర్స్‌ అనే బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి, వెబ్‌ కంటెంట్‌ను వ్యూయర్స్‌ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.
 
ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్‌సిరీస్‌లు సెట్స్‌పై ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి చేయాలని నేను ప్లాన్‌ చేయలేదు. ఏడాది మూడు ప్రాజెక్ట్స్‌ చేయాలని అనుకున్నాను. కానీ కరోనా కారణంగా ఇలా జరిగింది. ఒకేసారి ఆరు ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లు ఉన్నాయి. సో బిజీగా ఉంటున్నాను. ఇది అదృష్టమో! దురదృష్టమో! తెలియడం లేదు.
 
ఒకరితో అసోసియేట్‌ అవ్వడం నాకు ఏం ప్రాబ్లమ్‌ కాదు. క్యాలికులేషన్స్‌ లో వన్‌ ప్లస్‌ వన్‌ అంటే టు కానీ భాగస్వామ్యంలో వన్‌ ప్లస్‌ వన్‌ ఈక్వెల్‌ టు త్రీ అంటారు. అలాగే పెద్ద సినిమాలకు సహ నిర్మాతగా ఉండటం నాకు ఒకే. ఒక అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమని నేను భావిస్తాను.
 
నేను, మారుతి, బన్నీవాసుగారు, యూవీవంశీగారు మేం నలుగురం సినిమాల్లోకి రాకముందే మంచి మిత్రులం. నేను ‘ఈ..రోజుల్లో’ సినిమాతో నిర్మాతనైయ్యాను. ‘100 పర్సెంట్‌ లవ్‌’తో వాసు, ‘మిర్చి’తో వంశీ నిర్మాతలుగా మారారు. అందరం హిట్‌ సినిమాలతోనే నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చాం. మా అందరికీ మంచి సింక్‌ ఉంటుంది. సో..మా భాగస్వామ్యాల విషయంలో క్రియేటివ్‌ డిఫరెన్స్‌ ఉండవు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్‌ను బట్టి మాలో ఒకరికి నచ్చపోయిన ముందుకు వెళతాం.
 
లెక్కల కంటే ముందు మేం స్నేహితులం. సో పెద్ద ప్రాబ్లమ్స్‌ లేవు. పైగా నిర్మాత అల్లుఅరవింద్‌గారి సలహాలు, సూచనలతో ముందుకు వెళుతున్నాం. అరవింద్‌గారు మిమ్మల్ని ప్రొత్సహిస్తున్నారు.
 
మారుతి దర్శకుడిగా పరిచయం అయిన తొలి సినిమాకు నేను నిర్మాతను. మారుతి తొమ్మిది సినిమాలు తీస్తే వాటిలో ఆరు సినిమాలకు నేను నిర్మాతగానో, సహ నిర్మాతగానో ఉన్నాను. నా ప్రతి భాగస్వామ్యంలోనూ ఆయన ఉంటారు.
 
సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ ఓటీటీ, ఏ ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌ కూడా రీ ప్లేస్‌ చేయలేవు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.సో  వారి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఈ సమయంలో వెల్లడంలో తప్పులేదెమో! కానీ థియేటర్స్‌ వ్యవస్థ లేకపోతే స్టార్‌డమ్‌ తగ్గిపోయింది. థియేటర్స్‌ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్‌కు మాత్రమే కాదు.ఇండస్ట్రీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్స్‌ బిగ్‌స్రీన్‌పై సినిమా చూసేందుకే మొగ్గుచూపుతాను. ఒకసారి థియేటర్స్‌లో సినిమా ప్రదర్శితమే ఆ తర్వాత ఓటీటీకి వస్తేనే బెటర్‌ అని నా అభిప్రాయం.
 
లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేస్తే తెలుగు ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు.  స్టార్‌ హీరో సినిమాలు విడుదలైనప్పటికీని ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తున్న సమయంలో పవన్‌కల్యాణ్‌గారి వకీల్‌సాబ్‌ వస్తే ఎంతటి ఓపెనింగ్‌ వచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే క్రాక్, జాతిరత్నాలు, ఫస్ట్‌వేవ్‌ తర్వాత విడుదలైన తొలి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించారు.
 
సినిమా మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీకు వెళ్తున్నాం. హోటల్‌కు వెళ్తున్నాం. అలాగే సినిమాలకు వెళతాం. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరిగింది. ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది. సో థర్డ్‌ వేవ్‌ లేకపోతే థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయితే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే అనుకుంటున్నాం.
 
మన నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌ ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తునే ఉన్నాం. సినిమా ఆపరేటింగ్‌ కాస్ట్‌ కూడా చాలా పెరిగిపోయింది. అలాగే సినిమా టికెట్‌ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయినా టికెట్‌ ధరలు పెరగడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాయితీలను ఇస్తుంది. ఇండస్ట్రీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ సెక్టార్‌ కూడా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి. ఇక సినిమాల విడుదల తేదీలు మన చేతుల్లో లేవు.