మొక్కలు నాటిన రాంచరణ్

Published On: November 11, 2020   |   Posted By:
మొక్కలు నాటిన రాంచరణ్
 
 
మెగా పవర్ స్టార్ కు చేరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
 
మొక్కల నాటే యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా మును ముందుకు సాగుతుంది. చేయి చేయి కలుపుకొని పచ్చని నేలకు పందిరి వేస్తుంది. ఆత్మీయులకు ప్రేమతో మొక్కలు నాటే బాధ్యతల్ని పరిచయం చేస్తుంది. తద్వారా ప్రకృతిని కాపాడే బృహత్కార్యానికి బీజం వేస్తున్నది.
 
 
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో ఈ రోజు మెగాపవర్ స్టార్ రాంచరణ్ పాల్గొన్నారు. బాహుబలి ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాంచరణ్ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. 
 
అనంతరం రాంచరణ్ మాట్లాడుతూ.. ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టిన నా స్నేహితుడు ప్రభాస్.. నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అని . నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ  భూమి మీద మనగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
 
ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా బట్, దర్శకుడు రాజమౌళి,తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని  పిలుపునిచ్చారు.