రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published On: November 8, 2021   |   Posted By:
రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఈవెంట్
Image
 
 
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్‌ను హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ విడుదల చేశారు.
 
కార్తికేయ మాట్లాడుతూ “ఈ ఫంక్ష‌న్‌కు పిలిచిన వెంట‌నే వ‌చ్చిన ‘దిల్’ రాజుగారు, సుధీర్ బాబుగారు, శ్రీవిష్ణు అన్నయ్య, విశ్వక్ సేన్, కిరణ్, ప్రతి ఒక్కరికీ థాంక్యూ. ‘రాజా విక్రమార్క’ చిరంజీవిగారి టైటిల్. ఆయన టైటిల్ పెట్టుకునేంత స్థాయి ఉందని అనుకోవడం లేదు. కానీ, చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి సినిమా ఏది చూసినా అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాం. ‘గ్యాంగ్ లీడర్’ చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నా. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ ప్రతి సినిమా చూసినప్పుడు ఫ్యాన్స్ అలాగే ఫీలయ్యాం. ఆ అభిమానికి మించిన అర్హత లేదని ఫీలయ్యి. ధైర్యం చేసి టైటిల్ పెట్టేసుకున్నాను. నా సినిమాలు అన్నిటిలో నేను సొంతంగా టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా చేయలేదు. దర్శకుడు ముందు వేరే టైటిల్ అనుకుంటే బాగానే ఉందనుకున్నాం. ఫోనులో ‘రాజా విక్రమార్క’ పేరు కనిపిస్తే ఈ టైటిల్ పెడితే బావుంటుందని నాకు అనిపించింది. మా దర్శకుడికి ఇటువంటివన్నీ నచ్చవు. నేను అడిగే సరికి ఒక రోజు టైమ్ తీసుకుని సెట్ అవుతుందని చెప్పాడు. దాంతో నేను చాలా హ్యాపీ. చిరంజీవిగారి టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సినిమాకు వస్తే ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత కథలు వింటున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీ సరిపల్లి కథ చెప్పాడానికి వచ్చాడు. విన్నాను. కథ నచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కొన్ని సినిమాలు చేశా. అయితే, ఈ సినిమా నా సినిమా అన్నట్టు మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది. శ్రీ ఏ పని చేసినా నిజాయతీగా, శ్రద్ధగా చేస్తాడని ఫస్ట్ మీటింగ్ లో అనిపించింది. ఆ నమ్మకం ఈ సినిమా మీద కన్వర్ట్ అయ్యింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత రెండు మూడు సినిమాలు అటు ఇటు అయితే నా స్క్రిప్ట్ సెలక్షన్ ఏదోలా ఉంటుందన్నట్టు జనాలు ఫేస్ పెట్టేవాళ్లు. ‘నేను హిట్టు కొడుతున్నా చూడు’ అని లోపల వాళ్లకు కమ్యూనికేట్ చేయాలని అనిపించేది. మాస్ ఇమేజ్ కోసమనో, భారీగా విడుదల చేయవచ్చనో కొన్ని సినిమాలు చేస్తాం. ఈ సినిమా మాత్రం కథ విని, ఎగ్జైట్ అయ్యి శ్రీతో ట్రావెల్ అవ్వాలని చేశా. మనసులో అనిపించింది చేశా. చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు. అనిపించింది. అలాగే, ఈ సినిమాకు అనిపించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నాకు నా మీద నమ్మకాన్ని ఇస్తుంది. అంత ఇంపార్టెంట్ మూవీ ఇది. ఈ సినిమా మేం ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. అప్పుడు ’90 ఎంఎల్’ స్టార్ట్ చేశాం. అదే సమయంలో వినోద్ రెడ్డిగారు ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డిగారిని పరిచయం చేశారు. వాళ్లు మేం చేస్తామన్నారు. 2019లో సినిమా మొదలైంది. మధ్యలో నేను ‘చావు కబురు చల్లగా’ చేశా. తర్వాత కరోనా వచ్చింది. ఈ సమయంలో శ్రీ, అతని టీమ్ చాలా పాజిటివిటీతో ఉన్నారు. నాకు శ్రీతో మళ్లీ సినిమా చేయాలనుంది. మళ్లీ చేయాలంటే సినిమా సక్సెస్ అవ్వాలి. మనం మంచి మనసుతో బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డిగారికి థాంక్స్. వాళ్లకు నిర్మాణం కొత్త అయినా… నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కష్టపడి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాను. వాళ్లకు హిట్ ఇచ్చి సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటాను. సాయికుమార్ గారు, సుధాకర్ కోమాకుల, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్ గారు  అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అద్భుతంగా నటించారు. నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఈ సినిమాలో నటించాడు. బెస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకు కుదిరింది. నాకు ‘గ్యాంగ్ లీడర్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలకు మంచి పేరొచ్చింది. కానీ, ‘ఆర్ఎక్స్ 100’ రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు. అయినా ‘ఈ సినిమా హిట్టవుతుంది. బావుంటుంది’ అని నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న, నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి 100 శాతం కష్టపడతా. ‘రాజా విక్రమార్క’తో మొదలుపెట్టి నేను ఎంపిక చేసుకునే ప్రతి కథ, నేను చేసే ప్రతి సినిమా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తా. మీరు గర్వపడేలా చేస్తా. ప్రామిస్ చేస్తా” అని అన్నారు. 
 
‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశారు. తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ “నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే ‘నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా’ అని చెప్పా. ఫైనల్లీ ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్ వైఫ్” అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.   
 
‘దిల్’ రాజు మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీలో కొత్త జనరేషన్ కొత్త కొత్తగా ఆలోచిస్తూ వస్తున్నారు. కార్తికేయ, కిరణ్, సుధాకర్ గానీ! నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది ‘మీకు బ్యాగ్రౌండ్ లేదు కదా! ఎలా?’ అని అనేవాళ్లు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లకు బ్యాగ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు కూడా వాళ్లు ప్రూవ్ చేస్తున్నారు. ఒక అపోహ ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారని. కార్తికేయ బాబాయ్ ‘ఆర్ఎక్స్ 100’ టీజర్ చూపిస్తే ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాను. ఆ సినిమాతో హీరో సక్సెస్ అయ్యాడు. విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అతనిది గుడ్ ఛాయిస్. ‘కార్తికేయ హీరోలానే ఉండాలి. ఇలాగే చేయాలి’ అని ఫిక్స్ అవ్వకు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళితేనే లాంగ్ రన్ ఉంటుంది. ‘రాజా విక్రమార్క’ చిరంజీవిగారి టైటిల్. కొత్త నిర్మాతలు, కొత్త టీమ్. ట్రైలర్ చూశా. ఇంప్రెసివ్ గా ఉంది. ట్రైలర్ చూశాక కార్తికేయకు కాల్ చేశాను. బాగా చేశావని చెప్పాను. సీరియస్ రోల్స్ కాదు, హ్యూమర్ కూడా బాగా చేస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమైంది. నవంబర్ 12న విడుదల అవుతున్న సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.       
 
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను బిజీగా ఉన్నపటికీ కార్తికేయ కోసం వీలు చేసుకుని ఇక్కడికి వచ్చాను. కార్తికేయతో మాట్లాడినప్పుడు క్లోజ్ ఫీలింగ్ వస్తుంది. నేను చాలా ఇయర్స్ నుంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాను. సినిమాల కోసం చేసినా ఆ పాపులారిటీ ఎక్కువైంది. చాలామంది కొన్ని సినిమాలకు బాడీ బిల్డ్ చేశారు. తర్వాత నార్మల్ అయ్యారు. కొద్దిమందే మెయింటైన్ చేస్తూ వచ్చారు. నేను చేస్తున్నట్టు ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే కార్తికేయ. తనలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలడని నా ఫీలింగ్. ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కూడా ఒక ఇన్నోసెన్స్ కనిపించింది. కార్తికేయకు టైలర్ మేడ్ ఫిల్మ్ ఇది. తను సక్సెస్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా. టీజర్ చూశాక దర్శకుడు ఎవరని కనుకున్నా. గతంలో ఒకసారి శ్రీ సరిపల్లిని కలిశా. సినిమాటోగ్రాఫర్ పీసీ మౌళి ‘ప్రేమకథా చిత్రమ్’కు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ప్రశాంత్ విహారి సంగీతంలో కొత్తదనం కనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. నవంబర్ 12న ఫస్ట్ షో చూస్తా” అని అన్నారు. 
 
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చూసిన వెంటనే ‘భలే ఉంది’ అనిపించింది. బాగా నచ్చింది. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రేక్షకులు అందరికీ సినిమా బాగా నచ్చి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతకు కంగ్రాట్స్. ఆయనకు బాగా డబ్బులు వచ్చి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు, ఆయన టీమ్ కు కూడా కంగ్రాట్స్. సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది. సక్సెస్ మీట్ లో ఇంకా ఎక్కువ మాట్లాడదాం” అని అన్నారు.
 
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “కార్తికేయ ఫోన్ చేశాడు. షూటింగులో ఉన్నాను. తొమ్మిదిన్న వరకూ షూటింగ్ అంటే ప్యాకప్ చెప్పేసి జెట్ స్పీడులో వచ్చేశా. తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అందరూ కలిసి మెలిసి ఉంటారు. ఎంత కలిసి ఉన్న ‘వాడు అది. వీడు ఇది’ అని మాట్లాడతారు. అందరు హీరోలు కలిసి ఒకడి గురించి మంచిగా మాట్లాడుతున్నారంటే అది కార్తికేయ గురించి. మనోడు అడిగితే ‘నో’ చెప్పాలనిపించదు. హీరోలు అందరికీ పెళ్లికి ముందు బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. కార్తికేయకు కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడాలి. ఇప్పుడు అజిత్ గారి ‘వాలిమై’తో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. కార్తికేయను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నుండి మన సినిమావాళ్లు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పాత రోజులు వచ్చేశాయి” అని అన్నారు.
 
సాయి కుమార్ మాట్లాడుతూ “వచ్చే ఏడాదికి నేను మేకప్ వేసుకుని 50 ఏళ్లు. ఇన్నేళ్లుగా మేకప్ వేసుకుంటున్నా. ప్రతి సినిమా ఒక న్యూ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఒక ఎగ్జైట్‌మెంట్‌. ‘రాజా విక్రమార్క’ నాకు అటువంటి ఎగ్జైట్‌మెంట్‌. చాలా మంచి కథ. అదేంటో రేపు థియేటర్లలో చూడాలి. కార్తికేయకు మామగా, తాన్యాకు తండ్రిగా నటించాను. వెరీ గుడ్ టీమ్, యాక్టర్లతో నటించాను. కార్తికేయతో చేయడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను” అని అన్నారు.   
 
నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “సినిమా చూశాం. బాగా వచ్చింది. కార్తికేయ అద్భుతంగా నటించారు. ఆయన సహకారంతో సినిమా సూపర్ గా వచ్చింది. మూడు నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయాలనుకున్నాం. కానీ, కరోనా వల్ల రెండేళ్లు పట్టింది. నా పేరులో ’88’ ఏంటనేది నాలుగు సినిమాల తర్వాత చెబుతాను” అని అన్నారు. 
 
సమర్పకులు ఆదిరెడ్డి .టి మాట్లాడుతూ “పదేళ్లుగా విశాఖ, ఉత్తరాంధ్రలో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉంది. ప్రొడక్షన్ కూడా చేద్దామని ఈ సినిమా చేశాం. మా ఫ్రెండ్ వినోద్ రెడ్డిగారి ద్వారా కార్తికేయగారు పరిచయం అయ్యారు. ‘రాజా విక్రమార్క’ను కార్తికేయగారు వాళ్ల సొంత ప్రొడక్షన్ లో చేద్దామని అనుకున్నారు. మాకు ఓ అవకాశం ఇవ్వమని అడగటంతో ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు. కార్తికేయగారు మాకు ఎంతో హెల్ప్ చేశారు” అని అన్నారు.
 
సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ “ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం దర్శకుడు శ్రీ సరిపల్లి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కంటే ముందు 10, 12 ఏళ్ల క్రితం నేను అమెరికాలో ఆడిషన్స్ కి వెళ్తున్న సమయంలో ఒక సినిమా సెట్ లో చూశా. ఇంగ్లిష్ ఫిల్మ్స్, షోస్ గురించి మాట్లాడేవాడు. రెండు మూడుసార్లు కలిశాం. నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వచ్చింది. నేను ఇండియా వచ్చి సినిమాలు చేస్తున్న సమయంలో ఇక్కడ కనిపించాడు. ‘నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? తెలుగు సినిమాలు కూడా చేస్తావా?’ అని అడిగా. ‘చేయకూడదా?’ అన్నాడు. వీవీ వినాయక్ దగ్గర చేస్తున్నానని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం కథ చెప్పాడు. హీరోగా ఎవరిని తీసుకొస్తాడో? అనుకున్నా. కార్తికేయ వచ్చాడు. చాలా హ్యాపీ. కార్తికేయతో సినిమా చేసే నెక్స్ట్ దర్శకులు అందరూ ఫైట్స్ విషయంలో కష్టపెడతారు. తెలుగు నేటివిటీతో హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ పెట్టి శ్రీ సినిమా తీశాడు. కరోనా వల్ల సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టినా… మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ కార్తికేయ, శ్రీ అలాగే ఉన్నారు. ఇద్దరిలో ఎనర్జీ ఎక్కడా డ్రాప్ కాలేదు. కార్తికేయ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేశాడు. కష్టపడి సినిమా చేశారు. చిరంజీవిగారి సినిమా టైటిల్ పెట్టుకున్నందుకు హండ్రెడ్ పర్సెంట్ మెగా సక్సెస్ సాధిస్తుంది. ఇందులో నన్ను తీసుకున్నందుకు థాంక్యూ. నేను ఏసీపీగా నటించాను. సాయి కుమార్, తనికెళ్ల భరణి గొప్ప నటులతో చేయడం సంతోషంగా ఉంది. చిరునవ్వు చెదరకుండా ఆదిరెడ్డి, రామారెడ్డి సినిమా నిర్మించారు. నవంబర్ 12న నా పుట్టినరోజు. ఈ సినిమా రిలీజ్ నా బర్త్ డే గిఫ్ట్” అని అన్నారు.  
 
సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ “ఇటువంటి జానర్ సినిమా ఇంతకు ముందు నేను చేయలేదు. నాకు అవకాశం ఇచ్చిన శ్రీ సరిపల్లికి థాంక్స్. కార్తికేయ సినిమాలకు నేను ఫ్యాన్. ఆయన సినిమాకు ఫస్ట్ టైమ్ మ్యూజిక్ ఇచ్చాను. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం సమయానికి చేయగలుగుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. సూపర్బ్ పర్ఫార్మన్స్ వల్ల ఈజీగా చేశా. నవంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా నిర్మాత ’88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డిగారు ఎంతో బాగా చూసుకున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్” అని అన్నారు.
 
దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “డైరెక్టర్ అవ్వడానికి చాలా జర్నీ ఉంటుంది. చాలామంది హెల్ప్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. వెనక్కి లాగుతారు. ఓ దశ దాటాకా జర్నీ టఫ్ అవుతుంది. నీరసం వస్తుంది. లాస్టులో ఒకడు టార్చ్ లైట్ వేసి రమ్మని పిలిచాడు. అతడే కార్తికేయ. మూడేళ్ల క్రితం మా ఇద్దరి జర్నీ మొదలైంది. మా టీమ్ అంతా ఇక్కడ నిలబడి ఉన్నారు. శ్రీ అంటే నేను కాదు. మా టీమంతా! సినిమా నాది అనుకుని మొదలుపెట్టాను. ‘మాది’ అని వాళ్లంతా జాయిన్ అయ్యారు. ‘మన అందరిదీ’ అని ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డి జాయిన్ అయ్యారు. నవంబర్ 12న సినిమా రిలీజ్ అవుతోంది. నచ్చితే నేను కనిపించినప్పుడు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్, థ్రిల్, సిట్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి” అని అన్నారు. 
 
హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన హీరో కార్తికేయ, నిర్మాత ’88’ రామారెడ్డి గారు, సమర్పకులు ఆదిరెడ్డిగారికి థాంక్స్. సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హర్షవర్ధన్, సుధాకర్ గారితో నటించడం హ్యాపీగా ఉంది. లవ్లీ విజువల్స్, మ్యూజిక్ ఇచ్చిన పీసీ మౌళి, ప్రశాంత్ విహారికి థాంక్స్” అని అన్నారు. 
 
నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ “కార్తికేయకు మంచి స్క్రిప్ట్ దొరికితే బావుంటుందని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఆయనకు సూటయ్యే విధంగా, ఆయన టాలెంట్ ను ఎలివేట్ చేసే విధంగా శ్రీ సరిపల్లి  అద్భుతమైన కథ తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ రెండేళ్లు ఈ సినిమాతో ప్రయాణం చేశారు. మధ్యలో కరోనాను తట్టుకుని కార్తికేయ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల శ్రీ అవుట్‌స్టాండింగ్‌ వర్క్ చేశాడు. నిర్మాతతో సహా చాలామందికి తొలి సినిమా ఇది. వాళ్లందరూ ఓ మంచి ప్రాజెక్ట్ చేశారు. నేను కళ్లారా చూశాను. ఇప్పుడు నిర్మాతల దగ్గర నుంచి అందరూ వాళ్ల వాళ్ల పేర్లు చెప్పుకొంటారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత వాళ్ల నోటితో పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత సక్సెస్ అవుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు.
 
లిరిక్ రైటర్ కృష్ణకాంత్ (కె.కె) మాట్లాడుతూ “ఈ సినిమాలో ‘రాజాగారు వేటకొస్తే…’ పాట రాశా. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీకి థాంక్స్. ప్రశాంత్ విహారిగారితో తొలిసారి పని చేశా. కార్తికేయగారికి పాట రాయాలని ఆయన ఫస్ట్ మూవీ నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. థాంక్స్ కార్తికేయ. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా అలాగే అదిరిపోతుంది ఆశిస్తున్నాను” అని అన్నారు.    
 
లిరిక్ రైటర్ సనారే మాట్లాడుతూ “ఈ సినిమాలో మంచి సన్నివేశంలో వచ్చే ఒక పాట రాశా. నేను రాయడం గొప్ప కాదు, నాకు అవకాశం ఇచ్చిన ’88’ రామారెడ్డిగారికి, దర్శకుడు శ్రీ అన్నయ్యకు, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అన్నయ్యకు… అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా హీరో కార్తికేయ అన్నయ్యకు. ఆయనతో నా రెండో సినిమా ఇది. ఇలాగే, ఆయన సినిమాలకు పాటలు రాయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. 
 
తెలుగులో తనకు ఇది తొలి సినిమా అని ఎడిటర్ జస్విన్ ప్రభు చెప్పారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. 
 
కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కేకే,  సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.