శశివదనే చిత్రం ప్రకటన

Published On: September 17, 2021   |   Posted By:

 

పలాస 1978′ సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ప్రేక్షకుల హృదయాలను కదిలించే మరో మంచి కథతో సినిమా చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గురువారం సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు.  

‘రేయ్! రోజూ ఆ అమ్మాయి వెనుక తిరుగుతున్నావు. ఏదో ఒక రోజున నీకు పడుతుందని అనుకుందాం! కానీ, వాళ్ళింట్లో ఎలా ఒప్పిస్తావ్ రా?’ – హీరోకి స్నేహితుడి ప్రశ్న.

‘ఏముందిరా!? వాళ్ళ క్యాస్ట్ కాదనుకో? మన కులపోడు కాదంటారు. ఒకవేళ వాళ్ళ కులమే అయినా… మా స్థాయికి సరిపోలేదంటారు. కానీ, కులాన్నీ – స్థాయిని చూసి ప్రేమ పుట్టదు కదరా! ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాలంతే’ – హీరో రక్షిత్ అట్లూరి సమాధానం.

టీజర్‌లో సంభాషణలు, దృశ్యాలు, ‘కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గోడపై చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి కలిగించాయి.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “అందమైన, అర్థవంతమైన ప్రేమకథా చిత్రం ‘శశివదనే’. ఈ రోజు విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్‌కు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అక్టోబర్ లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. రక్షిత్, కోమలీ ప్రసాద్ జంట ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని వివరాల్లో త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సంగీతం: శరవణ వాసుదేవన్,  కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.