సార్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్

Published On: February 17, 2023   |   Posted By:

సార్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్

సార్ సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం ఆనందంలో చిత్ర బృందం

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. ముందు రోజు సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, విశ్లేషకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. నాకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయి. నిన్న ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. షో షోకి వసూళ్ళు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్, డీజే టిల్లు సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు సార్ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకట్రెండు ప్రీమియర్ లు అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తో షోలు పెంచుకుంటూ పోయాము. ఒక్క హైదరాబాద్ లోనే 25 ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం 40 షోలు వేశాము. ధనుష్ గారి రఘువరన్ బి.టెక్ తెలుగులో టోటల్ రన్ మీద ఎంత వసూలు చేసిందో ఆ మొత్తం ఒక్కరోజులోనే సార్ కి వస్తాయి. తమిళ్ లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్ గా ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశముంది అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. 2018 లో వచ్చిన నా మొదటి సినిమా తొలిప్రేమ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంతమంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీ గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పినట్లుగా ముందు రెండు ప్రీమియర్లు అనుకున్నాం కానీ అవి పెరుగుతూ 40 షోల వరకు వెళ్లాయి. ఈ 40 షోలకు వచ్చిన స్పందనతో తమిళ్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అన్నారు.

ఈ సమావేశంలో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు దర్శక నిర్మాతలు సమాధానాలు ఇచ్చారు.

సితారలో కమర్షియల్ సినిమాలతో పాటు జెర్సీ,సార్ వంటి బ్యానర్ కి గౌరవం తీసుకొచ్చే సినిమాలు చేయడం ఎలా ఉంది?.
నాగవంశీ: సినీ పరిశ్రమ నుంచి కొందరు ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడారు. రాజు గారు ఫోన్ చేసి ఈ సినిమాకి డబ్బులు, పేరు రెండూ వస్తాయి అన్నారు. మళ్ళీ ఇంకోసారి నువ్వు నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే సినిమా వచ్చింది ఇలాంటి మంచి సినిమా తీయి అని ఆయన ఫోన్ చేసి చెప్పారు.

మంచి సబ్జెక్ట్ తో తమిళ్ లోకి ప్రవేశించారు కదా ఇలా మరిన్ని ద్విభాషా చిత్రాలు చేస్తారా?
నాగవంశీ: ఏదైనా మంచి కథ వస్తే, ఇది రెండు భాషల్లో చెప్పాల్సిన కథ అనిపిస్తే ఖచ్చితంగా తీస్తాము. పైగా ఇప్పుడు గేటు కూడా ఓపెన్ అయిపోయింది కదా.

మీరు ఈ తరహా కథ చిత్రాలను తీసే ప్రతిభను ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు?
వెంకీ అట్లూరి: మొదటి సినిమా విజయం సాధించినప్పుడు మనకు అదే సరైన రూట్ అనిపించి అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నేను అదే చేశాను. మిస్టర్ మజ్ను విషయంలో కొంత అతి విశ్వాసం దెబ్బ తీసింది. రంగ్ దే ప్రయత్న లోపం అని చెప్పలేను కానీ వరుసగా మూడో లవ్ స్టోరీ కావడం, పరిస్థితుల ప్రభావం వల్ల దానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. దాంతో నా దారిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వరుసగా మూడు ప్రేమ కథల తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులను నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేయడం జరిగింది. కేవలం సందేశం మాత్రమే ఇవ్వాలనుకోలేదు. వినోదం కూడా పంచాలనుకున్నాను. సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. విడుదలకు ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను. ఈ చిత్రం చాలాకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

విడుదల తర్వాత ధనుష్ గారి స్పందన ఏంటి?
వెంకీ అట్లూరి: ధనుష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రే ఫోన్ చేసి ప్రీమియర్ల స్పందన ఏంటని అడిగారు. బాగుంది సార్ అంటే రేపు ఉదయం వరకు ఆగు అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకు అన్నారో అర్థంకాలేదు. చెన్నైలో నేను ప్రేక్షకుల మధ్యలో షో చూశాక అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అడిగారు. చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే అందుకే నిన్ను ఆగమన్నారు అన్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల ధనుష్ గారితో పాటు టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

ఈ కథకి స్ఫూర్తి ఏంటి?
వెంకీ అట్లూరి: ఈ కథ కల్పితం. కానీ ఇదంతా ఇంటర్మీడియట్ చదివినప్పుడు మనం చూసిన, అనుభవించిన కథలు. నేను చూసిన, చుట్టుపక్కల జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అందుకే అంత సహజంగా ఉంది.

మీరు నిజ జీవితంలో దీనిని అనుభవించారా?
నాగ వంశీ: మనందరికీ అనుభవమే కదా. నేనొక పెద్ద కాలేజ్ లో ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ ర్యాంక్ రాలేదు. డొనేషన్ అడిగితే ఎక్కువ చెప్పారు. మా అమ్మ పొలం అమ్మి నన్ను చదివించింది. అయినా కూడా నేను అనుకున్న కాలేజ్ లో చదువుకోలేకయాను. ప్రస్తుతం ఎల్కేజీలకు ఫీజులు దారుణంగా ఉన్నాయి. ఫీజులు తగ్గిస్తే చదువు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాం.