సీతారామం చిత్రం థాంక్ యూ మీట్

Published On: August 12, 2022   |   Posted By:

సీతారామం చిత్రం థాంక్ యూ మీట్

సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పాదాభివందనం : సీతారామం’ థాంక్ యూ మీట్ లో చిత్ర యూనిట్.

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’.  హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

ఈ నేపధ్యంలో ‘సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘సీతారామం’ థాంక్ యూ మీట్ నిర్వహించింది.

కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. వాళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. దత్ గారికి వారిద్దరూ పెద్ద అండ. మహానటి, జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం  వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వైజయంతి బ్యానర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కృతజ్ఞతలు. వైజయంతి బ్యానర్ లో ఐదు సినిమాలు చేశాను. బ్యానర్ పై ఎన్టీఆర్ గారి ఫోటో వుంటుంది. అలాగే నాన్నగారు, చిరంజీవి గారు వైజయంతిలో చిత్రాలు చేశారు. వైజయంతి పేరుని స్వప్న, ప్రియాంక నిలబెడుతున్నారు. సీతారామం చూసి చాలా జలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది.(నవ్వుతూ). గీతాంజలి, సంతోషం, మన్మధుడు రోజులు గుర్తుకు వచ్చాయి. సీతారామం విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రొమాన్స్ మళ్ళీ తెరపైకి వచ్చింది. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు. దర్శకుడు హను చాలా వివరంగా, అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇంటర్వెల్ పాయింట్ లో ప్రేక్షకులని ఎవరూ ఊహించని రీతిలో లాక్ చేశారు. సెకండ్ హాఫ్ అత్యద్భుతంగా వుంది. ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. పాటల చిత్రీకరణ కూడా అందంగా వుంది. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులౌతుంది. ఈ క్రిడిట్ అంతా దర్శక నిర్మాతలు చిత్రం కోసం పని చేసిన అందరికీ దక్కుతుంది. మృణాల్ పాత్రలో ప్రేమలో పడిపోయా. అంత అందంగా వుంది. ఎవరైనా ఆ పాత్రలో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. దుల్కర్ ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్ లో వుంది. దుల్కర్ లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే వుండాలని కోరుకుంటాను. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు.సీతారామంకు  రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని స్వప్న చెప్పడం ఆనందంగా వుంది. అశ్విని దత్ గారు సినిమా థియేటర్ కి మళ్ళీ ఆడియన్స్ ని తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. సీతారామంను ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..  ‘సీతారామం’ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ప్రేక్షకుల చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తుంది.  స్వప్న దత్  అద్భుతమైన నిర్మాత. తనకి అసాధ్యం అంటూ ఏమీ వుండదు. మహానటి, ఇప్పుడు సీతారామం. నా కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన కథలే ఎంపిక చేస్తారు స్వప్న. అశ్విని దత్ గారు నా అభిమాన వ్యక్తి.  మృణాల్ లాంటి నటితో పని చేయడం ఆనందంగా వుంది. సీత పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. రామ్ పాత్ర నా కెరీర్ లో చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్రని రాసిన హను గారికి కృతజ్ఞతలు. సుమంత్ గారితో కలసి నటించడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని చోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకొక్కరు ఏడు,ఎనిమిదిసార్లు సినిమాని చూశామని చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారు ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారు స్టయిల్ కి ఐకాన్, సూపర్ స్టార్.   ‘సీతారామం’కు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం విజయం మాటల్లో చెప్పలేని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సీత లాంటి ఐకానిక్ పాత్ర ఇచ్చిన దర్శకుడు హను గారికి,  వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, అశ్వనిదత్, స్వప్న, ప్రియాంక అందరికీ హృదయపూర్వం కృతజ్ఞతలు. అశ్వినిదత్ గారు నా మార్గదర్శి. దుల్కర్ లాంటి గ్రేట్ కోస్టార్ లేకుండా ఈ జర్నీ జరిగేది కాదు. దుల్కర్ కి బిగ్ థాంక్స్. సీతారామం యునిక్ కి, ప్రేక్షకులకు మరోసారి పెద్ద థాంక్స్” తెలిపారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. గత 5వ తేది నుండి ఒక ఊహప్రపంచంలో బ్రతుకున్నట్లుగా వుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. నాలుగు సినిమాలు తీశాను. కానీ ఇప్పుడింత ఆదరణ లేదు. మొదటిసారి ఈ ఆదరణ చూస్తున్న. ఇప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. ‘సీతారామం’ నాకు బాగా దగ్గరైన కథ.  ‘సీతారామం’ కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి వుంది. తెరపై కనిపిస్తున్న రామ్ సీతలతో పాటు తెరవెనుక చాలా మంది మనిషి చేశారు. వారందరీకి పేరుపేరునా థాంక్స్. మణిరత్నం-నాగార్జునల గీతాంజలి నా ఫేవరేట్ మూవీ. ఆ సినిమాని నుండి చాలా నేచుకున్నా. నాగార్జున గారికి కృతజ్ఞతలు. నన్ను చాలా భరించిన రామ్, సీతగారికి కృతజ్ఞతలు. సినిమా ఒక దృశ్య కావ్యంలా వచ్చిందంటే కారణం పీఎస్ వినోద్ గారు. ఆయనకి కృతజ్ఞతలు.  విశాల్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.  ప్రొడక్షన్ డిజైన్ సునీల్ బాబు, కాస్ట్యుమ్స్ శీతల్ కి థాంక్స్. సుమంత్ గారు విష్ణు శర్మ పాత్ర చేయకపోయేతే ఇంత వైబ్ వచ్చేది కాదు. అఫ్రిన్ పాత్ర చేసిన రష్మిక కి నేను జీవితాంతం రుణపడి వుంటాను. స్వప్న గారు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. సీతారామం క్రెడిట్ స్వప్న గారికే దక్కుతుంది. ఈ సినిమాని గొప్పగా ఆదరిస్తూ రిపీటడ్ గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ..  నాగార్జున మా హీరో.  మా బ్యానర్ అత్యధికంగా ఐదు చిత్రాలు చేశారు. తర్వాత చిరంజీవి గారు నాలుగు చిత్రాలు చేశారు. సీతారామం సినిమా తీస్తున్నపుడు నాగార్జున గారే గుర్తుకు వచ్చారు. వారితో సినిమాలు నిర్మించిన రోజు మర్చిపోలేనివి. అలాగే మా బ్యానర్ లో ఎక్కువ చిత్రాలు చేసిన శ్రీదేవి, జయప్రదలను గుర్తు చేసుకున్నపుడు సీతారామంలో మృణాల్ కనిపిస్తోంది. మహానటి, ఇప్పుడు  సీతారామంతో రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయారు. దర్శకుడు హనుగారి, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి, ఈ ఈవెంట్ కి వచ్చిన నాగార్జున గారికి మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ..దత్ గారితో నాకు నలబై ఏళ్ల జర్నీ వుంది. నలభై ఏళ్లుగా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా చాలా కష్టపడి బ్యానర్ పేరు నిలబెట్టడం చాలా ఆనందంగా వుంది. సీతారామంను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరిన్ని గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.