హీరో సుశాంత్ విలేకరుల సమావేశం

Published On: August 28, 2021   |   Posted By:

హీరో సుశాంత్ విలేకరుల సమావేశం

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమా సక్సెస్ మీద  పూర్తి నమ్మకం ఉంది – హీరో సుశాంత్

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మీడియాతో ముచ్చటించారు.


చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను.

 
ఏం చేసినా కూడా సొంతంగా చేసుకోవాలని, మనది మనమే నిలబడాలని చిలసౌ కంటే ముందు నాగార్జున గారు చెప్పారు. బీ ఇండిపెండెంట్ అని చెప్పడంతో, నాకు నచ్చిన సినిమాను చేస్తే ఆ రిజల్ట్ తెర మీద కనిపిస్తుందని అనుకున్నాను. డౌట్లు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ రాదేమో అని అనుకున్నాను. అందుకే చిలసౌ నుంచి ఎక్కువ ఒత్తిడి తీసుకోలేదు. ఎంతో ఫ్రీగా చేశాను.. ఆ విషయాన్ని త్రివిక్రమ్ గారు సెట్‌లో పసిగట్టారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నావ్ అని త్రివిక్రమ్ అన్నారు.

 
చిలసౌ విడుదలకంటే ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. నూటొక్క జిల్లాల అందగాడు సాగర్. హరీష్ ప్రొడ్యూసర్ ద్వారా దర్శన్‌ను పంపించారు. కాలనీలో జరిగే సంఘటనలు తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలు అని కథను నెరేట్ చేశారు. చిలసౌ కంటే ముందే ఈ కథను చేస్తాను అని చెప్పాను. కానీ మధ్యలో అల వైకుంఠపురములో చేశాను. నాకోసం చాలా వెయిట్ చేశారు. ఈ కథకు నిరంజన్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సెట్స్ మీదకు వెళ్లలేదు. మీరు  పర్మిషన్ ఇస్తే వింటాను అని నిరంజన్ రెడ్డి గారిని నేను అడిగాను. ఈ కథ నాకైతే బాగుంటుందని ఆయన కూడా చెప్పారు. అలా ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు  చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇంతకు ముందు విన్నట్టు ఎక్కడా అనిపించలేదు. కాంప్లికేటెడ్ కథ అయితే కాదు.. ఎంతో రియలిస్టిక్ ఉంటుంది. ఎంటర్టైనింగ్‌గానూ ఉంటుంది. కమర్షియల్ టచ్ కూడా ఉంటుంది.

 
ఫిబ్రవరి 1న ప్రారంభించినా  మార్చి 15 వరకు చాలానే పూర్తి చేసేశాం. జూన్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. కృష్ణా నగర్‌లో ఒక్కరోజు  షూటింగ్ మాత్రమే మిగిలింది. కానీ లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్తే అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. సినిమా మీదున్న పాజిటివ్ వైబ్ మమ్మల్ని నడిపించింది. ఫస్ట్ లాక్డౌన్ మామూలుగా గడిచింది. అయితే జనవరిలో వద్దామని అనుకున్నాం కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది. ఆ తరువాత మళ్లీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. అది చాలా కష్టంగా గడిచింది. ఓటీటీ ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో జనాలు వస్తారో లేదో అనే అనుమానాలు వచ్చాయి. నిర్మాతలను కూడా ఎక్కువగా ఒత్తిడి పెట్టలేం. వాళ్లు కూడా సినిమాను నమ్మి  థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని వెయిట్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఆఫర్‌తోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు. అందుకే మేం కూడా విడుదలకు సిద్దమయ్యాం.

 
సినిమా సక్సెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ  బాగానే ఉందని అన్నారు. డిజిటల్ ఆఫర్ ఇచ్చిన వారు కూడా సినిమాను చూసే తీసుకున్నారు. కొన్ని సీన్స్ గుర్తుండిపోయాయని అందరూ అన్నారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. మా వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ఇక జనాలు తీర్పునివ్వాలి.

 
ముందు తమిళ్‌లో టైటిల్ చెప్పారు. నో పార్కింగ్ అని అనుకున్నాం. కానీ తెలుగులో ఉండాలని ఇచ్చట వాహనములు నిలుపరాదు అని అనుకున్నాం. అందరూ కూడా టైటిల్ బాగా ఉందని అన్నారు. తెలుగు వచ్చినా, రాకపోయినా కూడా అందరికీ అర్థం అవ్వాలని నో పార్కింగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాం.

 
కెమెరామెన్ సుకుమారన్, డైరెక్షన్ దర్శన్ మధ్య సింక్ బాగా కుదిరింది. కెమెరామెన్ ఉన్నారంటే దర్శన్ కాస్త ఫ్రీ అవుతారు.

 
రుహానీ శర్మ ఓ వర్క్ షాప్ గురించి చెప్పారు. అప్పుడు ముంబైకి వెళ్తే అక్కడ మీనాక్షి చౌదరి కనిపించారు. ఆమె మిస్ ఇండియా అని నాకు తెలీదు. నేను యాక్టర్ అని ఆమెకు కూడా తెలీదు. అయితే అక్కడ క్లాస్‌లో ఓ టఫ్ సీన్ చేశారు.  తెలుగు సినిమాలో చాన్స్ వస్తే చేస్తారా? అని అడిగాను. అలా మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె టాలెంట్‌కు కచ్చితంగా బిజీ అవుతుందని అనుకున్నాను. కానీ ఈ మూవీ విడుదల కాకముందే తమిళ, తెలుగు, హిందీలో ఆఫర్లు వచ్చేశాయి.

 
నేను ఎప్పుడూ సినిమాలు త్వరగానే పూర్తి చేయాలని అనుకుంటాను. అల వైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ఈ మూవీ లేట్ అయింది. అల వైకుంఠపురములో, ఇచ్చట వాహనములు రెండు కూడా ఒకే సంవత్సరంలో వస్తాయని అనుకున్నాను. కానీ పాండమిక్ వల్ల అది మిస్ అయింది.

 
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ పాండమిక్ వల్ల తెలుసుకున్నాను. ఒత్తిడిగా ఫీలవ్వడం కంటే మనం మన వాళ్లతో, మనం ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం బెటర్. మెడిటేషన్ చేయడం ప్రారంభించాను. పియానో నేర్చుకున్నాను. కుకింగ్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అలా అని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను.

 
అల వైకుంఠపురములో సినిమాను అందరూ చూశారు. తమిళ, మళయాలం.. ఓటీటీ, శాటిలైట్ ఇలా అందరూ చూశారు. సినిమా నుంచి బయటకు వచ్చిన వారంతా కూడా నువ్ గుర్తున్నావ్ అని అన్నారు. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్, బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.

 
త్రివిక్రమ్, బన్నీ ఇద్దరి కెమిస్ట్రీ, ర్యాపో బాగుంటుంది. ఆయన ఒకటి చెబుతారు ఈయన ఇంకోటి యాడ్ చేస్తారు. సీన్లు ఇంప్రూవ్ చేస్తుంటారు.  నాకు సరదాగా అనిపిస్తుంటుంది. సెట్ అంతా కూడా సందడిగా ఉంటుంది.

 
పెళ్లి కూడా సినిమాలానే నేను ఏదీ ప్లాన్ చేయలేదు. అలాంటి వాళ్లను ఇలాంటి వాళ్లను చేసుకోవాలని అనుకోలేదు. కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకోవాలని అనుకున్నాను. నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేయరు.

 
ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఎంటర్టైనింగ్‌గా ఉందని చెప్పారు. చాలా ఓపెన్ అయ్యావని అన్నారు. కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ బాగుందని అన్నారు ఆఫీస్‌లో ఎవ్వరూ లేనప్పుడు డ్యాన్స్ చేస్తుంటాను. ఇంత వరకు ఏ సినిమాలోనూ అలా చేయలేదు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని అన్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్.

 
చాలా కథలు విన్నాను. కానీ ఓ ద్విభాష కథ బాగా నచ్చింది. ఎన్ని విన్నా కూడా మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. అది చిలసౌ, ఇచ్చట వాహనములు నిలుపరాదకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడే వివరాలేవీ చెప్పలేను.