Reading Time: < 1 min

Shivaji and Laya Pair up Again

హిట్టు జోడీ మళ్లీ కుదిరింది

సినిమా ఇండస్ట్రిలో ఎంత పెద్ద స్టార్ నటులైనా సరే కొంతకాలమే లైమ్ లైట్‌లో వెలుగుతారు. ఆ తరువాత ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, ఏ బిజినెస్సో చేసుకుంటూ బిజీగా గడుపుతారు. నిజానికి ఇది ఒకనాటి మాట కానీ, ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. ఓటీటీలు వచ్చేశాయి. వెబ్ సిరీస్‌లు, రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. అందుకే వింటేజ్ యాక్టర్లు సైతం ఇప్పుడు మళ్లీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. అందులో భాగంగానే రెండు దశాబ్దాల కాలం నాటి హిట్ పెయిర్ అయినా హీరో శివాజీ, హీరోయిన్ లయ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఒక రకంగా ఇది పరిశ్రమకు శుభపరిణామమే అని చెప్పొచ్చు. వీరిని చూసి మళ్లీ సీనియర్ నటులకు ఆసక్తి పెరగొచ్చు.

శివాజీ, లయ ఇద్దరి కాంబినేషన్‌లో నవ్వులు పూయించే మంచి సినిమాలు వచ్చాయి. మిస్సమ్మ, టాటా బీర్లా మధ్యలో లైలా, అదిరందయ్య చంద్రం వంటి చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేశారు. ఆ తరువాత లయ సినమాలకు దూరం అయ్యారు. పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఇక హీరో శివాజీ సైతం అడపాదడపా సినిమాలు చేసుకుంటూ బిగ్ బాస్‌లో అడుగుపెట్టి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత హ్యాష్ ట్యాగ్ నైంటీస్ అనే వెబ్ సిరీస్‌తో సాలిడ్ హిట్ అందుకున్నారు. దీంతో మళ్లీ పరిశ్రమలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ లయ, శివాజీ కాంబినేషన్‌లో కొత్త దర్శకుడు సధీర్ శ్రీరామ్ ఓ సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్వయంగా శివాజీనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

ముహుర్త సన్నివేశాలకు దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్వీచ్‌ఆన్ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ జోనార్‌లో ప్రేక్షకులను అలరించే చిత్రం అవుతుందని మేకర్స్ తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తుందని చిత్రబృందం వెల్లడించారు.