Reading Time: 2 mins

Bhale Vunnade Pre Release Event 

భలే వున్నాడే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తున్న’భలే వున్నాడే’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 13 న రిలీజ్ అవుతుండగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.ముఖ్య అతిధి గా ప్రముఖ దర్శకుడు మారుతి విచ్చేశారు. దర్శకుడిగానూ, నిర్మాతగానూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందిస్తూ, ఇంకోపక్క సమకాలీన కాన్సెప్ట్‌లతో కొన్ని విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు దర్శకులు మారుతి .ఆవిధంగానే భలే వున్నాడే సినిమా కాన్సెప్ట్ మరియు మూల కథని నూతన దర్శకుడు అయిన జె శివసాయి వర్ధన్ కి ఇచ్చి ప్రోత్సహించాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా మనీషా కంద్కూర్ పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వి టీవి గణేష్,అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ ”నా మొదటి సినిమా  ‘ఉయ్యాలా జంపాలా’ రిలీజ్ అయిన తర్వాత నేను మొదటి కలిసిన సినిమా సెలబ్రిటీ మారుతి గారు. అప్పటినుండి నన్ను ప్రోత్సహిస్తూనే వున్నారు.అలా ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటూ ఉండేవాడిని ఇన్నాళ్ళకి ఈ సినిమా తో కుదిరింది. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా వున్నాను.దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారితో వరుసగా సినిమాలు చేస్తుండటం కూడా ఆనందాన్నిస్తోంది. మారుతి గారు చెప్పిన పాయింట్ తో మా డైరెక్టర్ శివ సాయి అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం వినోదంగా చిత్రీకరించారు. థియేటర్ లో మీ ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా. ఒక సెన్సిబుల్ పాయింట్ ని అంతే సంస్కారంతో డైరెక్టర్ డీల్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే పని రాక్షషుడు అని చెప్పాలి. ఆయన అనుకున్నది వచ్చేవరకు కంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఈ సినిమాతో బిజీ డైరెక్టర్ అవడం ఖాయం.సింగీతం శ్రీనివాస్ రావు గారు లాంటి సీనియర్ దర్శకులతో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అబిరామి గారు నాకు అమ్మగా నటించారు’ అని చెప్పారు.

డైరెక్టర్ శివసాయి వర్ధన్ మాట్లాడుతూ” నా పన్నెండేళ్ళ కల బిగ్ స్క్రీన్ మీద నా సినిమా ఈ 13 న రిలీజ్ అవుతుండటం చాలా ఎగ్జైటింగ్ గా వుంది, ఈ సినిమా కి కర్త,కర్మ ,క్రియ అన్నీ మారుతి గారే,అయన లేకపోతే ఈ సినిమా అనుకున్న టైములో పూర్తయ్యేది కాదు. ఆయనకి జీవితకాలం ఋణపడివుంటాను’ అని చెప్పారు.

ముఖ్య అతిది మారుతి మాట్లాడుతూ” ఈ చిత్రంతో ప్రొడ్యూసర్,డైరెక్టర్ కొంతమంది టెక్నీషియన్స్ పరిచయం అవుతున్నారు.నేను కూడా ఈ రోజుల్లో మూవీ తో అలా పరిచయం అయినవాణ్ణే, ఈ చిత్రం ప్రేక్షకులకు నిరుత్సాహ పరచదనే నమ్ముతున్నాను.నేను చెప్పిన చిన్న ఆలోచనని తనదైన శైలిలో అందంగా స్క్రీన్ ప్లే రాసుకొని సినిమా ఫినిష్ చేసినందుకు దర్శకుడు శివ సాయి ని అభినందించకుండా ఉండలేను. ఆయనకి  వున్న ప్యాషన్ ఈ సినిమా ఇంత చక్కగా రాడానికి కారణం అని చెప్పాలి. ఈ చిత్రంలో వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా అంతే సమపాళ్లలో వుంటుంది. గురువారం కొన్ని చోట్ల ప్రేమియర్స్ కూడా వున్నాయి ఆసక్తి వున్నవారు ఫ్యామిలీ తో కలిసి హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చు.రాజ్ తరుణ్ విషయానికి వస్తే మామూలుగా సినిమాల్లో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో అతని జీవితంలో కూడా అన్ని మలుపులు వున్నాయి. కానీ అవన్నీ దాటి సినిమా పట్ల అతనికి వున్న ప్యాషన్ ఏ సినిమా పై కూడా పడకుండా కష్టపడటం అతనికున్న గొప్ప క్వాలిటీ.వ్యక్తిగత సమస్యల్ని షూటింగ్ లో క్యారీ చేయకుండా డెడికేషన్ తో పనిచేసాడు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ని అభినందిస్తూ ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మిగతా నటీనటులు , టెక్నీషియన్స్ పాల్గొని వారి అనుభవాల్ని పంచుకున్నారు. యాంకర్ గా మంజూష  రాంపల్లి ఆద్యంతం సరదాగా ఈవెంట్ ని పూర్తిచేశారు.