Reading Time: < 1 min

Director Maruthi Birthday Special
డైరెక్టర్ మారుతి బర్త్ డే స్పెషల్

మారుతి అంటే కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, రైటర్, గ్రాఫిక్ డిజైనర్ వీటన్నిటితో పాటు నేటి త‌రానికి న‌చ్చేలా సినిమాలు తీసే క్రియేటర్. దాస‌రి మారుతి “ఈ రోజుల్లో ” సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌చిలీప‌ట్నంలో దాస‌రి మారుతి (Maruthi) జ‌న్మించారు. 1973 అక్టోబ‌ర్ 8న మారుతి పుట్టిన‌రోజు. డిగ్రీ పూర్తి అయిన తరువాత యానిమేష‌న్ కోర్సు కోసం హైద‌రాబాద్‌ వ‌చ్చారు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడంలో చేయితిరిగి ఉండడంతో యానిమేషన్ కు ఆ కళ తోడైంది.

యానిమేషన్ పూర్తి అయిన తరువాత కొన్ని కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత బన్ని వాసు పరిచయంతో మారుతి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన మొదటి నుంచి ఇష్టమైన కళారంగం సినిమా అలా “ఆర్య” సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత “ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే” సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశారు. త‌మిళంలో సూపర్ హిట్ సాధించిన “కాద‌ల్” చిత్రాన్ని “ప్రేమిస్తే” పేరుతో మారుతి కో ప్రొడ్యూసర్ చేశారు. అదే సమయంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి లోగో డిజైన్ తో పాటు, కొన్ని పొలిటికల్ యాడ్స్ కూడా చేశారు.

మారుతి విజన్ మార్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ. 2011లో ఆర్జీవి 5డి కెమెరాతో హీరో ర‌వితేజతో “దొంగ‌ల ముఠా” సినిమాను తెరకెక్కించారు. విషయం తెలుసుకున్న మారుతి తక్కువ ఖర్చుతో 5డితో “ఈ రోజుల్లో ” 2012లో తెరకెక్కించారు. సినిమా హిట్ కొట్టింది. దాంతో పరిశ్రమలోని ప్రముఖులు అంతా మారుతివైపు చూశారు. ఆ తరువాత వరుసగా బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్తజంట, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల‌ను తెరకెక్కించారు. అలాగే గ్రీన్ సిగ్నల్, లవ్ యు బంగారమ్ చిత్రాల‌కు మారుతి స‌హ‌ నిర్మాత‌గా ఉన్నారు. చిన్న సినిమాలతో పాటు గోపిచంద్ తో “ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్” తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయం కావాలని, మరిన్ని చిత్రాలు తీయాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున డైరెక్టర్ మారుతికి జన్మదిన శుభాకాంక్షలు.