అంతా విచిత్రం ఆడియో విడుదల

Published On: October 16, 2018   |   Posted By:

అంతా విచిత్రం ఆడియో విడుదల

అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు (కన్నారావు) ఆశీస్సులతో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘అంతా విచిత్రం’. జి.శ్రీను గౌడ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జై రామ్ కుమార్ దర్శకుడు. సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ్ భాస్కర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. మ్యాంగో మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కుదారు. ఆడియో వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, ముళ్లగూరు అనంత రాముడు,  చిత్ర నిర్మాత, అయాన్ ఆర్ట్స్ అధినేత మొహ్మద్ అస్లాం, దర్శకులు జై రామ్ కుమార్, చిత్ర సమర్పకులు ఎర్రోజు వెంకటాచారి, సహ నిర్మాత జి.శ్రీను గౌడ్,  సంగీత దర్శకులు భోలే షావలి, సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ భాస్కర్, ఎం.జి,ఎం అధినేత ఎం.అచ్చిబాబు పాల్గొన్నారు.

ప్రముఖ హాస్య కథానాయకుడు అలీతో ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన జై రామ్ కుమార్ ‘అంతా విచిత్రం’ చిత్రాన్ని అత్యంత వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించారని నిర్మాత మొహ్మద్ అస్లాం అన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫాన్స్ అయి ఉండి, వాళ్ళను నిజ జీవితంలో అనుకరిస్తుండే కొందరు కుర్రాళ్ళ కథతో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా అందరి ఆదరణ పొందుతుందని దర్శకుడు జై రామ్ కుమార్ అన్నారు. అందరూ చిన్న పిల్లలతో రూపొందిన ‘అంతా విచిత్రం’ మంచి విజయం సాధించాలని అతిధులు రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, అనంత రాముడు ఆశించారు.