వీర సైనికులకు ఘన నివాళి

Published On: February 19, 2019   |   Posted By:

వీర సైనికులకు ఘన నివాళి

ఉగ్రదాడిలో అమరులైన వీర సైనికులకు ఘనంగా నివాళి అర్పిస్తూ శాంతి ర్యాలీ జరిగింది. మనం సైతం సేవా సంస్థ, తెలుగు సినిమా వేదిక, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మనం సైతం సేవా సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ కుమార్, మోహన్ గౌడ్,  MR వర్మ, ఖుద్దూస్, నటుడు కృష్ణుడు, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు.

అమరులైన సైనికులకు నివాళి అర్పించిన అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్  మాట్లాడుతూ నూటా ముప్ఫై కోట్ల మంది భారతీయులు గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారంటే కారణం మన సైనికుల నిరంతర శ్రమ. అలాంటి  సైనికులను ఉగ్రమూకలు తమ బాంబు దాడులతో నిర్జీవులను చేస్తుంటే గుండె మండుతోంది. మన సైనికుల త్యాగం నిరుపమానం.  అమర సైనిక కుటుంబాలకు భారతీయులంతా అండగా నిలబడాల్సిన సమయమిది. ఉగ్రవాదులకు ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాల్సిన సందర్భమిది. చిత్ర పరిశ్రమంతా మన వీర సైనికులకు ఘనంగా అశ్రునివాలి అర్పిస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒకరు దేశం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. అన్నారు.