వై తరుణి రాణా చిత్రం ఆడియో వేడుక

Published On: February 24, 2020   |   Posted By:
వై తరుణి రాణా చిత్రం ఆడియో వేడుక

కొండారెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్ చిన్నా, రవీందర్ నటీనటులుగా బాన వెంకట కొండారెడ్డి నిర్మాతగా, వి అంబికా విజయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వై తరుణి రాణా’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం లహరి మ్యూజిక్ ద్వారా శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఆల్ రౌండర్ నటుడు జెమినీ సురేష్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సిఇవో నరేంద్రలు హాజరయ్యి ఆడియో బిగ్ సిడి, మరియు ట్రైలర్‌లను విడుదల చేశారు.

అనంతరం జెమినీ సురేష్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నేను నటించక పోయినా కేవలం సినిమా సంబంధంతో మాత్రమే ఇక్కడకు రావడం జరిగింది. అయితే ఈ చిత్రంలో నటించిన చిన్నా కూడా కారణమే.. తను మంచి ఫోటోగ్రాఫర్‌గా పరిచయం. ఇప్పుడు నటుడుగా మారాడు. తనకు సినిమాలంటే చాలా ప్యాషన్. సినిమాల పట్ల ప్యాషన్ ఉన్నవాళ్లు ఎప్పుడూ సక్సెస్ అవుతారు. ఇక ఈ చిత్ర ఆడియో విషయానికి వస్తే ఇందులో ప్రతి పాట పెద్ద వంశీ గారి సినిమాల్లోని లొకేషన్స్‌లా, పాటల్లా ఆహ్లాదంగా ఉన్నాయి. 80స్ లో వచ్చే పాటల్లా మనసుకు హాయిగా అనిపిస్తున్నాయి. చాలా మంచి టైటిల్ కూడా.. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాను.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాయంచ మాట్లాడుతూ… 10 ఏళ్ల క్రితం నేను కంపోజ్ చేసుకున్న మ్యూజిక్ ఇది. డైరెక్టర్ పాత పాటల్లా ఆహ్లాదంగా ఉండాలని అడిగారు అలానే నేను అందించడం జరిగింది. ఇందులో మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అదే కాకినాడ కాజా సాంగ్. ఈ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా స్టోరీ ఎలా అయితే బాగుందో.. అలానే ప్రతి టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగా కుదిరాయి. ఔట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చింది అన్నారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకం ఉంచి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత కొండారెడ్డి గారికి రుణపడి ఉంటాను. ఆయన నాకు మరో తండ్రి లాంటి వాడు. నన్ను కొడుకులా చూసుకున్నారు. అంత నమ్మిన నేను ఆయన నమ్మకాన్ని ఈ సినిమాతో వమ్ము చేయకూడదనే కష్టపడి పనిచేసి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయతించాను. ఇప్పుడు ఈ ఆడియోకు బెస్ట్ రెస్పాన్స్ వస్తోంది అంటే నిజంగా హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదలయ్యాక కూడా ఇలానే ఉంటుందని తెలియచేస్తున్నా అన్నారు.  

నిర్మాత తనయుడు బుల్ రెడ్డి మాట్లాడుతూ.. మొదట మా నాన్న కొండారెడ్డిగారు సినిమా చేయనున్నారు.. కానీ స్టోరీ విని స్క్రిప్ట్ పై మేము పడే కష్టం చూసి అంగీకరించారు. మ్యూజిక్ ఎలా అయితే హైలెట్ ఉందో అంతే బాగా సినిమా వచ్చింది. మార్చిలో సినిమా విడుదల కానుంది చూసి ఆదరిస్తారు అని నమ్మకంతో ఉన్నామన్నారు.

హీరో శాంతి రాజు మాట్లాడుతూ… నాకు ఈ ఆవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. చిన్నా వల్లే నేను ఇక్కడ ఉన్నా.. సినిమా ఉంది చేయమన్నారు అంతే… చేసాను. ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ చాలా బాగొచ్చాయి.. స్టోరీ ఇంకా బాగుంటుంది. మా ప్రయత్నం మేము చేశాము.. ఇక మీరే ఆదరించాలి అన్నారు.  

ఇంకా ఈ కార్యక్రమంలో  ఎంబిఎం డా. శ్రీధర్, సదా చంద్ర, యానాం బన్నీ, నరసింహారెడ్డి, యానాం స్వామి, పసలపూడి కర్రి రామరెడ్డి, సినిమాటోగ్రాఫర్ బాలకృష్ణ, లిరిసిస్ట్ సుబ్రమణ్యం, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.  

శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్ చిన్నా, రవీందర్,  అభినవ్ సక్సేన తదితరులు నటించిన ఈ చిత్రానికి
డైరెక్టర్: వి. అంబికా విజయ్
ప్రొడ్యూసర్ : బాన వెంకట కొండారెడ్డి
మ్యూజిక్: ఎల్. ఎం ప్రేమ్ రాయంచ, సదా చంద్ర
డిఓపి :రామ శ్రీనివాస్
ఎడిటింగ్: వినోద్ అడవి
రైటర్: బషీర్
కొరియోగ్రాఫర్స్: బాలకృష్ణ, చార్లీ రాక్ స్టార్, శ్యామ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఆనంద్
స్టంట్స్: వై. రవి