దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియా సమావేశం 

‘అగధ’ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది - దర్శకుడు ఎం.ఎస్. రాజు


శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలు ఓ సారి చూద్దాం.

‘అగధ’ అంటే ఏంటి?
‘అగధ’ అని టైటిల్ పెట్టగానే చాలా మంది నెట్‌లో సర్చ్ చేశారు. అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ తీసుకు వచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ బయటకు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్యాం ప్రసాద్ రెడ్డి నా గురించి ఓ మాట చెప్పాడు. నాకు తెలిసిన ఎం.ఎస్. రాజు కేవలం హారర్ ఎలిమింట్స్‌తో మాత్రమే సినిమా తీయడు.. ఇందులో చాలా అంశాలు ఉంటాయి అని ఆయన అన్నాడు. నన్ను ఎంత అర్థం చేసుకున్నాడో ఆ మాటలే సాక్ష్యం. ఆయన చెప్పినట్టుగానే కేవలం ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ‘అగధ’లో ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పని చేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’ అన్నట్టుగా చూపించాను.


అగధ’ కోసం మీరు చేసిన రీసెర్చ్ గురించి చెప్పండి?
‘అగధ’ కోసం చాలా రీసెర్చ్ చేశాను. చాలా చోట్ల తిరిగాను. అవన్నీ కూడా ఆడియెన్స్‌కి అవసరం లేదు. ఇదొక ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా అందరినీ రంజింపజేసేలా రూపొందించాను. నేను చూసిన రియాల్టీకి నా ఫ్యాంటసీని జోడించి ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తీశాను. ‘దేవి’ టైంలో నేను ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ ఏదో ఒక పవర్ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ‘అగధ’ జర్నీలోనూ నాకు అలాంటి ఓ ఫోర్స్ ముందు ఉండి నడిపించినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న తరాన్ని అట్రాక్ట్ చేసేలా దుష్టశక్తి మీద ఓ సినిమాని తీయాలని అనుకుని ‘అగధ’ చేశాను. కేవలం సింగిల్ స్క్రీన్స్ కాదు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకోవాలని అనుకున్నాను. ఈ చిత్రాన్ని నిజాయితీతో తెరకెక్కించాను.



మీరు సడెన్‌గా సినిమాల్ని నిర్మించడం ఆపేశారు.. ఎందుకు?
‘ఆట’, ‘మస్కా’ మంచి చిత్రాలు. కమర్షియల్‌గా విజయాలు అందుకున్నాను. కానీ నా స్టాండర్డ్‌లో లేవు అని చాలా మంది అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయి కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టాను. చాలా ఏళ్ల తర్వాత ‘డర్టీ హరి’ని తీశాను. అది నా టేస్ట్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. నా జర్నీలో ఎప్పుడూ కూడా కొత్త కథలకే ఓకే చెబుతూ వచ్చాను. ఎం.ఎస్. రాజు ఎలాంటి జానర్‌లో అయినా కూడా సినిమా తీయగలడు అనే పేరు సంపాదించుకోవాలి. నాకు నచ్చిన ఆర్ట్ ఫిల్మ్ తీసే బదులు మంచి కమర్షియల్ సినిమాని తీయడానికే ఇష్టపడతాను.


‘అగధ’ చిత్రం విజయంపై భారీ నమ్మకంతో ఉన్నారు?
నేను ఇంత వరకు స్టేజ్ మీద అలా ఓపెన్‌గా సినిమా బాగుంది అని స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ‘అగధ’ చూసిన తర్వాత సినిమా బాగుంది, విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది. అదే విషయాన్ని చెప్పా. మూవీని చూసిన తర్వాత అందరూ కూడా బాగుందని చెప్తారనే నమ్మకం నాకు ఉంది.


‘అగధ’ వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉంటుంది?
నేను ప్రతీ ఫ్రేమ్ మీద ఫోకస్ పెడతాను. నాకు క్లారిటీ వస్తే తప్పా ముందుకు వెళ్లను. నేను తీసిన ప్రతీ చిత్రంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతీ క్రాఫ్ట్ గురించి ఆలోచిస్తాను. నేను నిర్మాతగా ఉన్నప్పుడు కూడా దర్శకులతో కథా విషయంలో చర్చించేవాడ్ని. వాళ్లు కూడా నా సలహాలను తీసుకునేవారు. ఇప్పటి వరకు మీరు చూసిన టీజర్, ట్రైలర్‌లను బట్టే మా సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ స్టాండర్డ్ గురించి అర్థమై ఉంటుంది. సినిమాలో అంతకు మించి ఉంటుంది.


ఎన్టీ రామారావు గారి గురించి మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. దానిపై మీ వివరణ ఏంటి?*
నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను.


‘అగధ’ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పండి?
‘అగధ’ని ముందు ఎవ్వరికీ ఇవ్వకూడదని అనుకున్నాం. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది ఫోన్స్ చేశారు. కన్నడ నుంచి హోంబలే టీం సంప్రదించింది. గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియో టీం నుంచి కొంత మంది వచ్చి సినిమాని చూశారు. ముందు ఇక్కడ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. అరవై రోజుల తర్వాతే ఓటీటీకి ఇస్తామని అన్నాను. ఆ డీల్ ఇంకా హోల్డ్‌లోనే ఉంది.



మీ హీరోలతో మీకున్న రిలేషన్ గురించి చెప్పండి?
నేను నా ఆర్టిస్టులందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసెజ్ చేశారు. ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్ అన్నారు. ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు. త్రివిక్రమ్ షూటింగ్‌లో ఉండగానే వెంకటేష్‌ని కలిశాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నా హీరోల ఫ్యాన్స్ అంతా కూడా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.

ఇకపై దర్శకుడిగానే కంటిన్యూ అవుతారా? లేక సినిమాల్ని నిర్మిస్తారా?
ఇప్పుడు నేను కథ, స్క్రీన్ ప్లే, రైటింగ్, మేకింగ్ మీద దృష్టి పెట్టాను. నేను ఇప్పుడు ఆర్థిక విషయాల జోలికి వెళ్లడం లేదు. ‘డర్టీ హరి’, ‘అగధ’ విషయంలో నా ఫ్రెండ్స్ అంతా ముందుకు వచ్చి మేమే నిర్మిస్తాం అని అన్నారు. అందుకే ఆర్థిక భారాన్ని నేను తగ్గించుకుని కథ మీద, రైటింగ్ మీద ఫోకస్ పెడుతున్నాను.


అగధ 2’ కథ రెడీగా ఉందా?
‘అగధ’ రిలీజ్ అయిన తర్వాత ప్రీక్వెలా? సీక్వెలా? అన్నది చెప్తాను. ఈ మూవీకి ఆ స్కోప్ అయితే ఉంది. ‘అగధ’ ఓ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పగలను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘అగధ’ ఉంటుంది.